ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న గ్రామం
భక్తిశ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించిన మహిళలు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో గ్రామ దేవత ముత్యాలమ్మ బోనాల ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగాయి. పండుగను పురస్కరించుకుని ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, తోరణాలతో ప్రత్యేకంగా అలంకరించడంతో గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉదయం నుంచే మహిళలు సాంప్రదాయబద్ధంగా అలంకరించిన బోనాలను శిరస్సుపై ఎత్తుకుని, డప్పు చప్పుళ్లు, శివసత్తుల సిగాలు, పోతురాజుల విన్యాసాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారికి బోనాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. ఈ ఉత్సవాల్లో స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన బంధుమిత్రులు, చిన్నారులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పంతంగిలో పండుగ సందడి నెలకొంది. గ్రామస్థులంతా ఐక్యంగా పాల్గొని బోనాల పండుగను విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి