క్వీన్స్ కామన్వెల్త్ రైటింగ్ కాంపిటీషన్కు న్యాయనిర్ణేతగా అవకాశం
హయత్నగర్,: తెలంగాణకు చెందిన న్యాయవాది లుక్కా హిమజకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక క్వీన్స్ కామన్వెల్త్ రైటింగ్ కాంపిటీషన్–2026కు న్యాయనిర్ణేతగా వ్యవహరించే అవకాశం ఆమెకు దక్కింది. ఈ సందర్భంగా రాయల్ కామన్వెల్త్ సొసైటీ ‘వాల్యూడ్ జడ్జ్’ సర్టిఫికెట్తో ఆమెను సత్కరించింది.
తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా నమోదైన హిమజ..
ప్రస్తుతం హైకోర్టులోని ప్రముఖ మహిళా న్యాయమూర్తి ఆధ్వర్యంలో లీగల్ రీసెర్చర్గా సేవలందిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే రచనా పోటీలో న్యాయనిర్ణేతల బృందంలో చోటు దక్కించుకోవడం ఆమె ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.
చదువులోనూ ప్రతిభ
హిమజ చిన్ననాటి నుంచే విద్యలో ప్రతిభ కనబరిచారు. పాఠశాల విద్యలో 10/10 జీపీఏ సాధించారు. ఇంటర్మీడియట్లో కళాశాల ప్రథమ స్థానంలో నిలిచారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ, ఎల్ఎల్బీ ఐదేళ్ల కోర్సులో క్యాంపస్ ప్రథమ స్థానాన్ని సాధించారు. తెలంగాణ పీజీ లాసెట్లో రాష్ట్ర ప్రథమ ర్యాంకు పొందారు. అనంతరం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో పబ్లిక్ లా అండ్ లీగల్ థియరీలో ఎల్ఎల్ఎం పూర్తి చేశారు.
న్యాయమూర్తి కావడమే లక్ష్యం.
ప్రస్తుతం హైకోర్టులో లీగల్ రీసెర్చర్గా సేవలందిస్తున్న హిమజ.. భవిష్యత్తులో న్యాయమూర్తిగా సేవలందించడమే తన లక్ష్యమని తెలిపారు. ఆమె తల్లిదండ్రులు లుక్కా చంద్రశేఖరరావు, లుక్కా సురేఖ న్యాయవాదులుగా కొనసాగుతున్నారు. ఆమె సోదరి డాక్టర్ దివిజ జనరల్ మెడిసిన్లో ఎం.డీ. అభ్యసిస్తున్నారు.
1883లో ప్రారంభమైన క్వీన్స్ కామన్వెల్త్ రైటింగ్ కాంపిటీషన్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. పోటీలో విజేతల కోసం నిర్వహించే ‘విన్నర్స్ వీక్’ కార్యక్రమం లండన్లో జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక అవార్డు కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ప్రతిష్ఠాత్మక పోటీలో న్యాయనిర్ణేతగా హిమజకు లభించిన అవకాశం తెలంగాణకు, న్యాయవాద సమాజానికి గర్వకారణంగా నిలిచింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి