పేదలందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలి
పేదలందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలి
Biksham
సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట సీపీఎం ధర్నా.. ఏవోకు వినతిపత్రం
సూర్యాపేట ప్రభుత్వ విద్యా, వైద్య రంగాలను బలోపేతం చేసి పేద ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, అనంతరం జిల్లా కలెక్టరేట్ ఏవోకు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా మల్లు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి విద్య, వైద్యం వంటి ప్రాథమిక హక్కులను కల్పించాలని నిర్దేశించినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యా, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయకుండా ప్రైవేటీకరణను ప్రోత్సహించడం వల్ల పేదలు, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందన్నారు.
సూర్యాపేట జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా జనరల్ ఆసుపత్రిలో వైద్యులు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, వైద్య పరీక్షలు, ఆధునిక పరికరాలు, రక్తనిధి, ఐసీయూ, అత్యవసర వైద్య సేవలు లేక ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ చేయకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందన్నారు. తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్, గ్రంథాలయాలు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లు వంటి కనీస సౌకర్యాలు కూడా లేవని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత నాణ్యంగా అమలు చేసి విద్యార్థులకు పోషకాహారం అందించాలని కోరారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రతి మండలంలో జనాభాకు అనుగుణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య పరీక్షలు, మందులు ఉచితంగా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. అలాగే జిల్లా జనరల్ ఆసుపత్రితో పాటు కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరించాలని కోరారు.
అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడం, శిథిలావస్థలో ఉన్న భవనాలకు కొత్త భవనాలు నిర్మించడం, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాంలు, బూట్లు, బ్యాగులు విద్యా సంవత్సరం ప్రారంభానికే అందించడం, పేద విద్యార్థులకు హాస్టళ్లు, స్కాలర్షిప్లు, ఉచిత కోచింగ్ సదుపాయాలను విస్తరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వ విద్యా, వైద్య రంగాల బలోపేతమే సామాన్య ప్రజలకు సామాజిక న్యాయం అందించే మార్గమని, ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లాలోని సమస్యలను పరిష్కరించాలని మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలను సమీకరించి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న, జె. నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్, బెల్లంకొండ సత్యనారాయణ, పల్లె వెంకట్రెడ్డి, వట్టెపు సైదులు, దండ వెంకటరెడ్డి, మద్దెల జ్యోతి, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, బుర్రి శ్రీరాములు, పోసనబోయిన హుస్సేన్, సిరికొండ శ్రీను, నాగటి చిన్నరాములు, వల్లపు దాసు సాయికుమార్, పిండిగా నాగమణి, దేవరకొండ యాదగిరి, బూర్గుల ప్రభాకర్, మేకనబోయిన సైదమ్మ, మేరెడ్డి కృష్ణారెడ్డి, గుంజ వెంకటేశ్వర్లు, ఉప్పుల రమేష్, నాగిరెడ్డి శేఖర్రెడ్డి, నారాయణ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి