పాఠశాలలకు పీఎం శ్రీ నిధుల తప్పనిసరి వినియోగం అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆదేశాలు
పాఠశాలలకు పీఎం శ్రీ నిధుల తప్పనిసరి వినియోగం అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆదేశాలు
స్థానికం బృందం
పీఎం శ్రీ పథకం కింద పాఠశాలలకు మంజూరైన నిధులను నిబంధనల మేరకు తప్పనిసరిగా వినియోగించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం మినీ సమావేశ మందిరంలో పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎం శ్రీ పథకం పరిధిలో ఉన్న పాఠశాలల్లో యోగా, సైన్స్, గణిత ప్రయోగాలకు అవసరమైన పరికరాల కొనుగోలు, విద్యార్థులకు విజ్ఞాన, పరిశ్రమల అవగాహన పర్యటనలు, కళలు–హస్తకళల వంటి సహపాఠ్య, పాఠ్యేతర కార్యక్రమాల నిర్వహణ కోసం మంజూరైన నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.జిల్లాలో పీఎం శ్రీ కింద 25 పాఠశాలలకు సంబంధించిన గ్రాంట్ బిల్లులను ఆన్లైన్లో సమర్పించాలని, ట్రెజరీ అధికారులు నిబంధనల ప్రకారం వేగంగా మంజూరు చేయాలని ఆదేశించారు. పీఎం శ్రీ పాఠశాలల్లో అన్ని కార్యక్రమాలు నిర్ణీత కాలవ్యవధిలో సక్రమంగాఅమలయ్యేలాప్రధానోపాధ్యాయులతో నిరంతర సమన్వయం పాటించాలని జిల్లా విద్యాశాఖ అధికారికి సూచించారు.జిల్లాలో ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు తక్కువగా అందాయని పేర్కొన్న అదనపు కలెక్టర్, అర్హులైన ప్రతి విద్యార్థి తప్పనిసరిగా దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్వరలో పాఠశాలల వారీగా సమీక్ష చేపడతామని తెలిపారు. ప్రతి పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడిని నోడల్ అధికారిగా నియమించి, యుద్ధ ప్రాతిపదికన ఉపకార వేతనాల దరఖాస్తులు పూర్తి చేయాలని సూచించారు.జిల్లాలో ఏటీసీలుగా మారిన ఐటీఐలలో ప్రారంభమైన కొత్త కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. మార్చి నెలలో దేశవ్యాప్తంగా మూడో తరగతి విద్యార్థులకు నిర్వహించే ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి సత్యనారాయణ, ట్రెజరీ అధికారి మోహన్, అదనపు సాంఘిక సంక్షేమ అధికారి, మండల విద్యాధికారులు, పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సెక్టోరియల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి