పర్యాటక మాస్టర్ ప్రణాళికకు వేగం.అదనపు కలెక్టర్ భాస్కరరావు
పర్యాటక మాస్టర్ ప్రణాళికకు వేగం.అదనపు కలెక్టర్ భాస్కరరావు
స్థానికం బృందం
కీలక ప్రాంతాల అభివృద్ధికి రెండు రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
జిల్లాలో పర్యాటక రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి చర్యలు ముమ్మరమయ్యాయి. పర్యాటక మాస్టర్ ప్రణాళిక తయారీలో భాగంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రెండు రోజులలోపే సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన రాచకొండ కోట, భువనగిరి కోట, మహదేవ్పూర్, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, కొలనుపాక జైన దేవాలయం, మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం తదితర ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు.
పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. సమగ్ర అభివృద్ధి ప్రణాళికను ఎం/ఎస్ వోయంట్స్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూపొందించనుందని వెల్లడించారు.
సమావేశంలో పర్యాటక అధికారి ధనంజనేయులు, సహాయ సంచాలకుడు ఓంప్రకాశ్, రామమూర్తి, పోచంపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి