ప్రజాసంబంధాల రంగాన్ని మార్చేస్తున్న కృత్రిమ మేథస్సు వివేకంతో వినియోగించకపోతే విశ్వసనీయత దెబ్బతింటుంది – టి. శ్రీకర్ రెడ్డి
ప్రజాసంబంధాల రంగాన్ని మార్చేస్తున్న కృత్రిమ మేథస్సు వివేకంతో వినియోగించకపోతే విశ్వసనీయత దెబ్బతింటుంది – టి. శ్రీకర్ రెడ్డి
స్థానికం బృందం
ప్రజాసంబంధాలు, పాత్రికేయ వృత్తి నిర్వహణలో కృత్రిమ మేథస్సు కీలక పాత్ర పోషిస్తూ సంప్రదాయ విధానాలను మార్చేస్తోందని పీఆర్ సూత్ర వ్యవస్థాపకులు టి. శ్రీకర్ రెడ్డి పేర్కొన్నారు. వేగం, సౌలభ్యం పెరిగినప్పటికీ నమ్మకం, మానవ ధృవీకరణ లేకుండా సాంకేతికత ప్రయోజనం పరిమితమేనని ఆయన స్పష్టం చేశారు.డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన “ప్రజా సంబంధాలు – కృత్రిమ మేథస్సు” వెబినార్లో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడారు.ముద్రిత, దృశ్య, డిజిటల్ మాధ్యమాలు, సామాజిక వేదికల కోసం సమాచార ప్రసారం, ప్రకటనల రూపకల్పనలో కృత్రిమ మేథస్సు కీలక సాధనంగా మారిందన్నారు. పీఆర్ నిపుణులు తక్కువ సమయంలో ఆకర్షణీయమైన కంటెంట్ను రూపొందించడంలో ఏఐ తోడ్పడుతోందని తెలిపారు.అయితే డేటా గోప్యత, వాస్తవ ధృవీకరణ, నైతిక బాధ్యతలను విస్మరించరాదని హెచ్చరించారు. ఏఐ సామర్థ్యాలకంటే నమ్మకమే పీఆర్ రంగానికి అసలైన మూలధనమని పేర్కొన్నారు. వేగంగా మారుతున్న మీడియా వాతావరణానికి అనుగుణంగా నైపుణ్యాలను పదును పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సామాజిక శాస్త్రాల డీన్ ప్రొఫెసర్ పల్లవి కబ్డే మాట్లాడుతూ, కృత్రిమ మేథస్సు మీడియా, ప్రకటనలు, ప్రజాసంబంధాల రంగాల్లో గణనీయమైన మార్పులకు దారితీస్తోందన్నారు. జర్నలిజం పని తీరులోనూ విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయని చెప్పారు.ఈ వెబినార్లో కన్వీనర్ డా. సునీల్ కుమార్ పోతన, సహ కన్వీనర్ డా. యాదగిరి కంభంపాటి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి