ప్రజల ప్రాణాల రక్షణే ప్రధాన లక్ష్యం : సీఎం చంద్రబాబు
ప్రజల ప్రాణాల రక్షణే ప్రధాన లక్ష్యం : సీఎం చంద్రబాబు
GADDAM JAGANMOHAN REDDY
అమరావతి: రాష్ట్రంలో శాంతిభద్రతలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యమేమీ కాదని పేర్కొంటూ నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పటిష్ట కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ప్రతి ప్రాణం విలువైనదని, ప్రమాదాల వల్ల ప్రాణ నష్టం జరగకుండా పోలీసులు, రవాణాశాఖ సమన్వయంతో చర్యలు తీసుకోవాలని చెప్పారు.
మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎవరైనా సరే ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. బ్రీత్ అనలైజర్లు, వేగం కొలిచే పరికరాల కొనుగోలుకు రూ.44 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. జాతీయ సగటుతో పోలిస్తే రోడ్డు ప్రమాదాల విషయంలో రాష్ట్రం మెరుగైన స్థితిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
మొబైల్ ఫోన్ మాట్లాడుకుంటూ వాహనం నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి అంశాలను నియంత్రించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అనకాపల్లి, పశ్చిమ గోదావరి, విశాఖ తదితర జిల్లాల్లో ఉన్న ప్రమాదకర ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. జిల్లా పోలీసు అధికారులు, కలెక్టర్లు స్వయంగా పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మహిళలపై జరిగే నేరాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మహిళలపై నేరాల్లో నిందితులకు భయం కలిగేలా కఠిన చర్యలు తీసుకోవాలని, గృహ హింస కేసుల్లో కూడా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే మదనపల్లి తరహా ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి