Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 07:25 PM

పనితీరుకు ప్రాధాన్యం… ప్రభుత్వ యంత్రాంగంలో కొత్త అధ్యాయం సీయం చంద్రబాబు

పనితీరుకు ప్రాధాన్యం… ప్రభుత్వ యంత్రాంగంలో కొత్త అధ్యాయం సీయం చంద్రబాబు

పనితీరుకు ప్రాధాన్యం… ప్రభుత్వ యంత్రాంగంలో కొత్త అధ్యాయం సీయం చంద్రబాబు
February 24, 2026 06:02 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఉత్తమ ఉద్యోగులకు వెయిటేజ్, ప్రతి నెల అభినందన లేఖలు

రెవెన్యూ శాఖకు ‘ఫ్రెష్ లుక్’ తప్పనిసరి

ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత ఉండకూడదు

టెక్నాలజీ సేవలపై ప్రజల్లో విస్తృత అవగాహన

రాష్ట్ర పాలనలో నాణ్యత పెంపునకు, ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం బలోపేతానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు వారి పనితీరు ఆధారంగా వెయిటేజ్ ఇవ్వాలని, ప్రతినెల ఉత్తమంగా పనిచేసే సిబ్బందిని గుర్తించి ప్రభుత్వం తరఫున అభినందన లేఖలు పంపించాలని స్పష్టం చేశారు. ఆ ప్రశంసలను వారి సర్వీస్ రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు.

సోమవారం ఆర్టీజీఎస్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. క్షేత్రస్థాయిలో ప్రజల మన్ననలు పొందుతున్న ఉద్యోగులను గుర్తించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, పనితీరు తగ్గిన వారిలో సానుకూల మార్పు తీసుకురావచ్చని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన పోటీతత్వం ద్వారా పాలనలో పారదర్శకత, సామర్థ్యం పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.

ఆసుపత్రులు, దేవాలయాలపై కఠిన ఆదేశాలు

వైద్యారోగ్య శాఖపై సమీక్షిస్తూ అన్ని స్థాయిల్లో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఔట్‌సోర్సింగ్ సంస్థల నిర్లక్ష్యాన్ని ఉపేక్షించవద్దని, ఆసుపత్రుల అడ్మినిస్ట్రేటివ్ అధికారులకు పూర్తి బాధ్యత అప్పగించాలని స్పష్టం చేశారు. ఏ ఆసుపత్రిలోనూ వైద్యుల కొరత ఉండకూడదని, అవసరమైన చోట తక్షణ నియామకాలు చేపట్టాలని కలెక్టర్లతో సమన్వయం చేయాలని సూచించారు.

దేవదాయ శాఖకు సంబంధించి దేవాలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పాలని ఆదేశించారు.

రెవెన్యూకు మార్పు తప్పనిసరి

“రెవెన్యూ శాఖకు ఉన్న చెడ్డపేరు పోవాలి. స్పష్టమైన మార్పు కనిపించాలి” అని సీఎం తీవ్రంగా వ్యాఖ్యానించారు. రీ-సర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని, సేవలను పూర్తిగా ఆటోమేషన్ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రజలకు చేరువైన పాలన లక్ష్యం

తాగునీటి నాణ్యతపై క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించాలని, అవసరమైతే మొబైల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలపై సమగ్ర ఆడిట్ చేసి నివారణ చర్యలు చేపట్టాలని రవాణా శాఖకు ఆదేశించారు.

ప్రభుత్వం టెక్నాలజీ ఆధారంగా అందిస్తున్న సేవలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు మీ-సేవ కేంద్రాలు, డ్వాక్రా సంఘాల ద్వారా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

పనితీరును ప్రోత్సహించే ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ప్రభుత్వ వ్యవస్థలో సానుకూల మార్పులు వేగంగా కనిపిస్తాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News