ఓటు అమ్మితే వార్డు అభివృద్ధి అడిగే హక్కు కోల్పోతాం. కలెక్టర్ హనుమంతరావు
ఓటు అమ్మితే వార్డు అభివృద్ధి అడిగే హక్కు కోల్పోతాం. కలెక్టర్ హనుమంతరావు
స్థానికం బృందం
మున్సిపాలిటీల అభివృద్ధికి నిజాయితీ నాయకులే అవసరం
ఓటు అవగాహన కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు
మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే ప్రజల సమస్యల కోసం నిరంతరం పాటుపడే నాయకులను మాత్రమే ఎన్నుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పిలుపునిచ్చారు. ఓటును డబ్బు, మద్యం, బహుమతులు వంటి ప్రలోభాలకు అమ్ముకుంటే ఎన్నికల తర్వాత వార్డు అభివృద్ధిని అడిగే నైతిక హక్కును కోల్పోతామని ఆయన స్పష్టం చేశారు.
రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో విస్తృతంగా ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. యాదగిరిగుట్ట, భువనగిరి, ఆలేరు, మోత్కూర్, పోచంపల్లి, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధుల్లో సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. తమ ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీ గల మంచి వార్డు సభ్యుడినే ఎంచుకుంటామని ఓటర్లు ప్రతిజ్ఞ చేశారు.
ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఓటు అవగాహన ర్యాలీలు ప్రజల్లో చైతన్యాన్ని పెంచుతాయని అన్నారు. ప్రస్తుతం విద్యార్థులుగా ఉన్నవారే రానున్న రోజుల్లో ఓటర్లుగా మారతారని గుర్తు చేశారు.
డబ్బులు, మద్యం, కానుకలు తీసుకుని ఓటు వేస్తే గెలిచిన అభ్యర్థి ప్రజలవద్దకు రావాల్సిన అవసరం ఉండదని, అటువంటి పరిస్థితి వార్డు అభివృద్ధిని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. మంచి నాయకుడిని ఎన్నుకోవడం వల్లే వార్డులు అభివృద్ధిలో ముందుంటాయని తెలిపారు.
ప్రతి వార్డులో “మా ఓటును అమ్ముకోము – స్వచ్ఛందంగా ఓటు వినియోగించుకుంటాం” అనే నినాదంతో బోర్డులు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాల్లో సంబంధిత అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి