నల్గొండలో కోమటిరెడ్డి మార్క్ అభివృద్ధి...
నల్గొండలో కోమటిరెడ్డి మార్క్ అభివృద్ధి...
NM Yadav
మాన్యం చెల్కలో అత్యాధునిక యూపీహెచ్సీ షురూ..
ప్రభుత్వ నిధులు, ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో రూ. 2.41 కోట్లతో సౌకర్యాలు
నల్గొండ : రాష్ట్రంలోని పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారానే కార్పొరేట్ స్థాయి మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఈ నెల 6 నుండి 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సందర్బంగా బుధవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలో పర్యటించారు. జిల్లా కేంద్రంలోని మాన్యం చెల్కలో రూ. 1.91 కోట్ల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (యూపీహెచ్సీ) మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ..
నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిపై రోగుల ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతున్న విషయాన్ని గమనించి శివారు ప్రాంత ప్రజలకు చెంతనే వైద్యం అందించేందుకు ఈ కేంద్రాన్ని బలోపేతం చేసినట్లు తెలిపారు. ఈ యూపీహెచ్సీకి కేవలం భవనమే కాకుండా తన కుమారుడి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అదనంగా రూ. 50 లక్షల వ్యయంతో అత్యాధునిక మెడికల్ ఎక్విప్మెంట్, ఫర్నిచర్ మరియు అవసరమైన అదనపు డాక్టర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భవిష్యత్తులోనూ మాన్యం చెల్క ఆసుపత్రికి అవసరమైన మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా చుట్టుపక్కల ప్రాంతాల్లోని గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు ఈ కేంద్రం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఇక్కడే అన్ని రకాల వైద్య సేవలు పరీక్షలు నిర్వహించాలని వైద్యులకు సూచించారు. తీవ్రమైన సమస్యలు ఉంటేనే ప్రధాన ఆసుపత్రికి రిఫర్ చేయాలన్నారు. నల్గొండ కార్పొరేషన్ పరిధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా మెరుగుపరచడంతో పాటు అత్యుత్తమ వైద్య సదుపాయాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి తెలిపారు. స్థానిక కార్పొరేటర్లు తమ వార్డుల్లో వివిధ జబ్బులతో బాధపడే పేదలను గుర్తించి, ఈ ఆరోగ్య కేంద్రానికి పంపించి వారికి వైద్యం అందేలా చూడాలని కోరారు. అలాగే ప్రతీక్ ఫౌండేషన్ మరియు ప్రఖ్యాత ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలో మూడు ఎకరాల స్థలంలో అత్యాధునిక కంటి ఆసుపత్రిని నిర్మించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఒకవేళ ప్రభుత్వ కోటాలో మందులు అందుబాటులో లేకుంటే, ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఒక ప్రైవేట్ మెడికల్ షాపును అనుసంధానం చేశామని డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ఆధారంగా అక్కడి నుండి పేదలకు ఉచితంగా మందులు అందజేస్తామని వెల్లడించారు.
ఆసుపత్రికి వచ్చే రోగులకు అక్షయ ఫౌండేషన్ సహకారంతో భోజన సౌకర్యం కల్పించే ఆలోచన కూడా ఉందని మంత్రి తెలిపారు. వైద్యులు, ఆశా వర్కర్లు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని మాన్యం చెల్క చౌరస్తాను మరింత సుందరీకరించి విస్తరిస్తామని మంత్రి వివరించారు. నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మాన్యం చెల్కతో పాటు చుట్టుపక్కల వార్డుల ప్రజలకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ. 50 లక్షల సొంత నిధులు వెచ్చించినందుకు మంత్రిని అభినందించారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ.. విద్య, వైద్య రంగాలలో మంత్రి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఆరోగ్య ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న హెచ్పీవీ (HPV) వ్యాక్సిన్ను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసుపత్రికి అదనపు సౌకర్యాల కోసం మంత్రి సహకారాన్ని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, జిల్లా వైద్యాధికారి , ఆసుపత్రి సూపరింటిండెంట్ నరసింహారావు నేత, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి