Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:41 AM

నిజాం నిరంకుశత్వానికి ఎదురు నిలిచిన వీరనారి ఆరుట్ల కమలాదేవి వర్ధంతి… గుర్తింపుకోసం ఎదురుచూస్తున్న గెరిల్లా వీరగాథ

నిజాం నిరంకుశత్వానికి ఎదురు నిలిచిన వీరనారి ఆరుట్ల కమలాదేవి వర్ధంతి… గుర్తింపుకోసం ఎదురుచూస్తున్న గెరిల్లా వీరగాథ

నిజాం నిరంకుశత్వానికి ఎదురు నిలిచిన వీరనారి ఆరుట్ల కమలాదేవి వర్ధంతి… గుర్తింపుకోసం ఎదురుచూస్తున్న గెరిల్లా వీరగాథ
January 06, 2026 04:57 AM 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
తెలంగాణ స్థానికం ప్రతినిది
నిజాం నిరంకుశ పాలనకు, వెట్టిచాకిరి దోపిడీకి వ్యతిరేకంగా బందూక్ ఎత్తిన తొలి మహిళగా తెలంగాణ చరిత్రలో నిలిచిన సాయుధ పోరాట వీరనారి, మాజీ ఎమ్మెల్యే ఆరుట్ల కమలాదేవి వర్ధంతి సందర్భంగా ఆమె త్యాగాలు, పోరాటాలు మరోసారి గుర్తుకొస్తున్నాయి. రజాకార్లకు సింహస్వప్నంగా మారి, ప్రజల విముక్తి కోసం అజ్ఞాతవాసం, జైలు జీవితం అనుభవించిన కమలాదేవి గాథ నేటి తరాలకు స్ఫూర్తిదాయకం.1920లో నల్లగొండ జిల్లా ఆలేరు తాలూకా మంతపురిలో జన్మించిన కమలాదేవి (రుక్మిణి), ఆరుట్ల రామచంద్రారెడ్డితో వివాహానంతరం చదువుపై ఆసక్తితో హైదరాబాద్‌లో విద్యనభ్యసించారు. జాతీయోద్యమ ప్రభావంతో విప్లవ భావజాలం వైపు మళ్లి, ఆంధ్రమహాసభల ద్వారా ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. 1946–48 మధ్య తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళా గెరిల్లా దళాలను ఏర్పాటు చేసి ఆయుధ శిక్షణ అందించిన ధీశాలిగా నిలిచారు.చల్లూరు ఘటనలో భర్తతో కలిసి రిజర్వు పోలీసుల ఎదుట చూపిన వ్యూహాత్మక పోరాటం చరిత్రలో విరోచిత ఘట్టంగా నిలిచింది. 1948లో అరెస్టై వరంగల్, ఔరంగాబాద్, సికింద్రాబాద్ జైళ్లలో రెండున్నరేళ్లకు పైగా కఠిన కారాగారవాసం అనుభవించిన కమలాదేవి, “సంకెళ్ళు నాకు గడ్డి పరకలు” అంటూ పోరాటాన్ని ఆపలేదు.
1952లో భువనగిరి నుంచి శాసనసభకు ఎన్నికై, ఆ తర్వాత ఆలేరు నుంచి వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. కమ్యూనిస్టు పార్టీ ఉప నాయకురాలిగా, సిపిఐ శాసనసభాపక్ష తొలి మహిళా నాయకురాలిగా బాధ్యతలు నిర్వహించడం చారిత్రాత్మకం. కాకతీయ విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తూ ‘అపర రుద్రమదేవి’గా కీర్తించింది.1969 తొలి విడత తెలంగాణ ఉద్యమంలోనూ ముందుండి పోరాడిన కమలాదేవి, 2001 జనవరి 1న పరమపదించారు. అయినా, తెలంగాణ విమోచన పోరాటంలో అపూర్వ త్యాగాలు చేసిన ఈ వీరనారికి తగిన అధికారిక గుర్తింపు దక్కలేదన్న వాదన నేటికీ వినిపిస్తోంది. కుల, రాజకీయ పరిమితుల్లో చరిత్రను మసకబార్చలేమని—ఆరుట్ల కమలాదేవి గాథే సాక్ష్యం.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News