Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 11:47 PM

మున్సిపల్ ఎన్నికల్లో పారదర్శకతకు అధికారులే కీలకం – జిల్లా కలెక్టర్ హనుమంతరావు

మున్సిపల్ ఎన్నికల్లో పారదర్శకతకు అధికారులే కీలకం – జిల్లా కలెక్టర్ హనుమంతరావు

మున్సిపల్ ఎన్నికల్లో పారదర్శకతకు అధికారులే కీలకం – జిల్లా కలెక్టర్ హనుమంతరావు
February 06, 2026 03:42 PM 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపల్ ఎన్నికలను ఎలాంటి లోపాలు లేకుండా, పూర్తిస్థాయిలో పారదర్శకంగా నిర్వహించడంలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులదే కీలక పాత్రని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు స్పష్టం చేశారు.రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాల్లో కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఎన్నికల నిర్వహణకు జారీ చేసిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యలకు దారి తీస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకొని పూర్తి అవగాహనతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

పోలింగ్‌కు సంబంధించిన సామగ్రి ఉదయం ఎనిమిది గంటల వరకు పంపిణీ కేంద్రంలోనే ఉంచాలని తెలిపారు. పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ పెట్టెలు, ముద్రలు, గుర్తులు అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా ముందుగానే పూర్తిస్థాయిలోపరిశీలించుకోవాలని ఆదేశించారు. బ్యాలెట్ పెట్టెలు సులభంగా తెరుచుకుంటున్నాయా లేదా ముందస్తు పరీక్ష తప్పనిసరిగా చేయాలన్నారు.

పోలింగ్ కేంద్రంలో ప్రతి ఓటరు తన ఓటును స్వయంగా బ్యాలెట్ పెట్టెలో వేస్తున్నారా లేదా పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రిసైడింగ్ అధికారులదేనని స్పష్టం చేశారు. పోలింగ్ రోజున సమయపాలన పాటించడంతో పాటు ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.పోలింగ్ ముగిసిన వెంటనే పోలింగ్ సామగ్రిని జాగ్రత్తగా తీసుకువచ్చి స్వీకరణ కేంద్రాల్లో అప్పగించాలని తెలిపారు. ప్రతి ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి తన విధులను సమర్థంగా నిర్వహించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణారెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, తాసిల్దార్లు, ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News