మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి.. కేంద్ర నిర్ణయం
మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి.. కేంద్ర నిర్ణయం
స్థానికం బృందం
రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాబోయే వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ లేఖలు పంపింది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయి. ఎండల తీవ్రతలో లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ముందస్తుగా సరుకులు అందేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో నిల్వలపై చర్చ
దేశంలో తెలంగాణలోనే రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ జరుగుతోంది. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు ఆరు కిలోల చొప్పున బియ్యం అందుతోంది. రాష్ట్రంలో కోటికి పైగా ఆహార భద్రత కార్డులు ఉండటంతో, మూడు నెలల కోటా ఒకేసారి ఇవ్వాలంటే భారీగా నిల్వలు అవసరం. దీనిపై అధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.
పంపిణీలో సవాళ్లు
గతంలో ఒకేసారి మూడు నెలల కోటా పంపిణీ చేసినప్పుడు లబ్ధిదారులు, డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిల్వ సౌకర్యాల కొరత, వేలిముద్ర నమోదు ప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలు తలెత్తాయి. ఒక్కో కార్డుకు మూడు సార్లు వేలిముద్ర అవసరం ఉండటం, సర్వర్ సమస్యలతో సమయం ఎక్కువగా పడే అవకాశం ఉంది.
అయితే రవాణా ఖర్చులు తగ్గడం, ఒకేసారి సరఫరా పూర్తవడం వంటి ప్రయోజనాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పంపిణీ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి