మసీదుల వద్ద మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
మసీదుల వద్ద మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
స్థానికం బృందం
పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లింలకు అన్ని వసతులు కల్పించాలి
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని మసీదుల వద్ద అవసరమైన మౌలిక వసతులు సమకూర్చాలని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లా కేంద్రంలోని మినీ మీటింగ్ హాలులో రంజాన్ మాసం పురస్కరించుకొని శాంతి సంఘ సమావేశం అదనపు కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ ఏర్పాట్లకు సంబంధించి ప్రతి శాఖకు కేటాయించిన బాధ్యతలను సమన్వయంతో, సమయపాలనతో నిర్వహించాలని సూచించారు.
ప్రత్యేకంగా నమాజ్ సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని, మసీదుల వద్ద కరెంట్, మంచినీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మసీదుల పరిసరాల్లో పటిష్ట పారిశుధ్య పనులు చేపట్టడంతో పాటు వీధి దీపాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. మున్సిపాలిటీ వార్డులలో మంచినీరు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని, సరఫరాలో ఎలాంటి అంతరాయాలు రాకుండా పర్యవేక్షణ చేయాలన్నారు.
రంజాన్ మాసాన్ని సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, జిల్లా మతసామరస్యానికి ప్రతీకగా నిలవాలని అదనపు కలెక్టర్ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ రంజాన్ మాసంలో మసీదుల వద్ద పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భద్రతా పరమైన అన్ని చర్యలు చేపట్టి, మత పెద్దలతో సమన్వయం సాధించి సామరస్య వాతావరణంలో ప్రార్థనలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి