మార్చిలోనే పరిషత్ ఎన్నికలు..? రూ.450 కోట్ల నిధులే ప్రధాన కారణం
మార్చిలోనే పరిషత్ ఎన్నికలు..? రూ.450 కోట్ల నిధులే ప్రధాన కారణం
Biksham
వేగంగా కదులుతున్న రాష్ట్ర ప్రభుత్వం – తొలి వారంలో రెండు విడతల పరిశీలన
హైదరాబాద్
తెలంగాణలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను మార్చి నెలలోనే నిర్వహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు వేగవంతం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మునిసిపల్ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తే అదే ఊపును కొనసాగిస్తూ పరిషత్ ఎన్నికలకు వెళ్లాలన్న వ్యూహంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్న అవసరం ప్రభుత్వ ముందున్న ప్రధాన అంశంగా మారింది. ఈ ఏడాది లోపల పరిషత్ ఎన్నికలు నిర్వహించకపోతే జిల్లా, మండల పరిషత్లకు కేంద్రం నుంచి రావాల్సిన సుమారు రూ.450 కోట్ల నిధులు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నట్లు సమాచారం. అభివృద్ధి కార్యక్రమాలపై దాని ప్రభావం పడే అవకాశముండటంతో ఎన్నికల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలనే దిశగా యంత్రాంగం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రాథమిక సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. మార్చి తొలి వారంలో రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించే అవకాశాలపై పరిశీలన జరుగుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం సాధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. రాజకీయంగా కూడా ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తమ బలం నిరూపించుకోవాలనే లక్ష్యంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే వ్యూహరచనలో నిమగ్నమయ్యాయి. మునిసిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం పరిషత్ ఎన్నికలపై పడే అవకాశం ఉండటంతో అన్ని పార్టీల దృష్టి గ్రామీణ ఓటర్లపై కేంద్రీకృతమైంది.ఆర్థిక పరిమితులు, రాజకీయ లెక్కలు కలిసివచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల వేడి త్వరలోనే మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే ఎన్నికల షెడ్యూల్పై స్పష్టత రానుంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి