మహిళా రైతులే ఆహార భద్రతకు బలమైన ఆధారం: మంత్రి సీతక్క
మహిళా రైతులే ఆహార భద్రతకు బలమైన ఆధారం: మంత్రి సీతక్క
GADDAM JAGANMOHAN REDDY
మహిళా రైతుల పాత్ర వ్యవసాయ రంగంలో అత్యంత కీలకమని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న మెగా రైతు మేళాలకు ఆమె అభినందనలు తెలిపారు. రైతులకు ఉపయోగపడేలా వివిధ స్టాళ్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులను ప్రత్యేకంగా ప్రశంసించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సంవత్సరం మహిళా దినోత్సవాన్ని “గివ్ టు గైన్” అనే ప్రధాన థీమ్తో జరుపుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరాన్ని మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించిందని తెలిపారు. అందరికీ అత్యవసరమైనది ఆహారమని, ఆహారం పెరగాలంటే ఉత్పత్తి పెరగాలని, ఆ ఉత్పత్తిలో మహిళల పాత్ర అత్యంత ముఖ్యమని అన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో 60 నుంచి 80 శాతం వరకు మహిళలు పనిచేస్తున్నారని వెల్లడించారు. విత్తనాలు నాటడం నుంచి పంట కోయడం వరకు మహిళలు ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు.
అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తున్నప్పటికీ వారి శక్తికి తగిన గౌరవం ఇంకా పూర్తిగా దక్కలేదని మంత్రి పేర్కొన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మరియు వ్యవసాయ అనుబంధ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం కేవలం వేడుక మాత్రమే కాదని, ఇది మహిళల హక్కుల కోసం జరిగిన పోరాటాల గుర్తుగా జరుపుకునే రోజు అని ఆమె అన్నారు. ఒకప్పుడు మహిళలకు ఓటు హక్కు కూడా లేకపోయిందని గుర్తుచేశారు. కర్మాగారాల్లో పనిచేసే మహిళల హక్కుల కోసం సోషలిస్టు నాయకురాలు క్లారా జెట్కిన్ పోరాటం చేశారని చెప్పారు. ఆ పోరాటాల ఫలితంగానే మహిళలు తమ హక్కులు సాధించుకున్నారని, అనంతరం మార్చి 8న మహిళా దినోత్సవంగా ప్రకటించబడిందన్నారు.
మహిళా రైతులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు చట్టాలు రావాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు సాధించిన పురోగతితో పాటు ఇంకా సాధించాల్సిన లక్ష్యాలపై చర్చించాల్సిన సమయం ఇదేనని అన్నారు.
మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 30 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళలకు అండగా నిలవడానికి సీఎం ప్రారంభించిన “స్టాండ్ విత్ హర్” కార్యక్రమాన్ని కూడా ఆమె ప్రస్తావించారు.
పేదరిక నిర్మూలన కోసం సెర్ప్ ద్వారా 65 లక్షల మహిళలను సంఘటిత ఉద్యమంగా మార్చి ఆర్థికంగా ఎదగేలా చేస్తున్నామని మంత్రి తెలిపారు. మహిళలకు గుర్తింపు రావాలంటే మహిళా సంఘాల్లో చేరాలని సూచించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.
గత రెండు సంవత్సరాల్లో మహిళలకు బ్యాంకుల ద్వారా రూ.36 వేల కోట్ల రుణాలు అందజేసినట్లు మంత్రి వెల్లడించారు. వడ్డీ లేని రుణాలు కూడా అందిస్తున్నామని తెలిపారు. మహిళలు వ్యాపారాలు ప్రారంభించేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ ప్రోత్సాహంతో మహిళలు అనేక రంగాల్లో రాణిస్తున్నారని మంత్రి అన్నారు. వారి కృషికి గుర్తింపుగా కొందరిని సన్మానించి రూ.25 వేల ప్రోత్సాహక బహుమతి అందజేశామని తెలిపారు. ప్రతి మహిళా రైతు మహిళా సంఘంలో ఉండాలని, వ్యవసాయానికి అవసరమైన ఆర్థిక సహకారం అందిస్తామని చెప్పారు. లోన్ బీమా, ప్రమాద బీమా ద్వారా మహిళల జీవితాలకు భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
విత్తనాలు నాటడం, నాట్లు వేయడం, కోతలు కోయడం వంటి పనుల్లో మహిళలు పురుషులకంటే ఒక అడుగు ముందుంటారని మంత్రి సీతక్క అన్నారు. వారి శ్రమకు తగిన గౌరవం ఇవ్వడం సమాజం మొత్తం బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి