కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్ ఐదుగురు మావోయిస్టులు మృతి..
కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్ ఐదుగురు మావోయిస్టులు మృతి..
GADDAM JAGANMOHAN REDDY
తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన భారీ ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేతలు హతమైనట్టు భద్రతా వర్గాలు భావిస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడలేదు.
నిఘా వర్గాల సమాచారం మేరకు మావోయిస్టు కీలక నేత దేవ్జీ కర్రెగుట్ట ప్రాంతంలో ఉన్నారనే విశ్వసనీయ సమాచారం అందడంతో సుమారు ఐదు వేల మంది భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించారు. మధ్యప్రదేశ్ వైపు నుంచి మావోయిస్టులు అడవుల్లోకి చొరబడ్డారనే సమాచారం నేపథ్యంలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టగా కాల్పులు చెలరేగాయి. ప్రస్తుతం కూడా కొన్ని ప్రాంతాల్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావాన్ని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ గడువు సమీపిస్తున్న వేళ భద్రతా చర్యలు వేగవంతం అయ్యాయి. ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు మృతి చెందగా, వేలాది మంది వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఎదుట లొంగిపోయినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. పలువురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు దేహార్ మిశ్రా, దేవ్జీ, గణపతి సజీవంగా ఉన్నట్టు సమాచారం ఉన్నప్పటికీ తాజా ఘటనపై స్పష్టత రాలేదు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) కూడా కీలక నేతల కదలికలపై దృష్టి సారించింది. తాజా పరిస్థితులపై కేంద్ర హోం శాఖకు నివేదికలు పంపుతున్నట్లు తెలుస్తోంది.
కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా, పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి