కాంగ్రెస్ హామీలు మోసమే – చిట్యాలలో బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ హామీలు మోసమే – చిట్యాలలో బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం బృందం
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం తప్పనిసరి
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
చిట్యాలలో మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యలు
నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల మున్సిపల్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మాజీ ఎంపీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గత పాలనల అనుభవాలను గుర్తుచేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన రాజకీయ పక్షాలు ఉన్నప్పటికీ, భారత రాష్ట్ర సమితి ఢిల్లీలో అధికారంలో లేదని, గల్లీ స్థాయిలో ప్రజా మద్దతును పూర్తిగా కోల్పోయిందని అన్నారు. ఆ పార్టీకి ఓటు వేయడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, వారి పాలన మొత్తం ప్రతికూల జాబితాగా మారిందని, గత చరిత్రను చూసి ఆ పార్టీకి ఓటు వేయగలరా అని ప్రజలను ప్రశ్నించారు.
ఆరు హామీలు – అమలుకాని వాగ్దానాలు
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు వాస్తవంగా నాలుగు వందల ఇరవై హామీలుగా మారాయని విమర్శించారు. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన హామీల్లో ఇప్పటివరకు ఒక్కదాన్నీ పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు.ఉద్యోగ నియామక క్యాలెండర్ పేరుతో కుంభకోణాల క్యాలెండర్ నడుస్తోందని, ప్రతి బిల్లులో ముప్పై శాతం కమీషన్ తప్పనిసరి అయ్యిందని అన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు కమీషన్ ఇవ్వకపోతే రెండేళ్లుగా బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయని తెలిపారు.లేఅవుట్లు, భవన అనుమతుల విషయంలో విచ్చలవిడి అవినీతి జరుగుతోందని, ఎత్తైన భవనాలపై చదరపు అడుగుకు రెట్టింపు పన్నులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. మద్యం సీసాలపై అదనపు పన్నులు విధించి ప్రజలపై భారం మోపుతున్నారని పేర్కొన్నారు.పాలసీ పేరుతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ అవినీతి కథలు చెప్పుకుంటే అంతం లేదని వ్యాఖ్యానించారు.అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సింగరేణికి కానుకగా ఇచ్చిన ఒడిశాలోని నైని బొగ్గు గని ద్వారా వచ్చే భారీ ఆదాయాన్ని దోచుకునేందుకు కాంగ్రెస్ నేతల మధ్య పోటీ జరుగుతోందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలతో పట్టణాభివృద్ధి
కాంగ్రెస్ అవినీతికి భిన్నంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి విస్తృతంగా నిధులు, సంక్షేమ పథకాలు అందిస్తోందని తెలిపారు. తాగునీరు, మురుగు నీటి వ్యవస్థలు, రహదారులు, చెత్త నిర్వహణ, పట్టణ పేదలకు ఇళ్లు, వీధి వ్యాపారులకు రుణాలు, పట్టణ యువతకు ఉపాధి అవకాశాలు వంటి పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు.
కేంద్రం నుంచి నిధులు వస్తున్నా, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని సరిగా వినియోగించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
ప్రజలకు పిలుపు
ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని, కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి నిజాయితీ, అభివృద్ధి, పారదర్శక పాలన అందించే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ప్రజలను కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి