Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 03, 2026 09:04 PM

ఇక రాపిడో డ్రైవరే మీ గైడ్.. ఏపీ పర్యాటక శాఖ సరికొత్త ప్రయోగం!

ఇక రాపిడో డ్రైవరే మీ గైడ్.. ఏపీ పర్యాటక శాఖ సరికొత్త ప్రయోగం!

ఇక రాపిడో డ్రైవరే మీ గైడ్.. ఏపీ పర్యాటక శాఖ సరికొత్త ప్రయోగం!
March 03, 2026 07:07 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యాటక రంగాన్ని మరింత ప్రజలకు దగ్గర చేయాలనే లక్ష్యంతో ప్రముఖ రైడ్ సేవా సంస్థ Rapido తో భాగస్వామ్యం కుదుర్చుకుని ‘డ్రైవర్-కమ్-గైడ్’ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఫిబ్రవరి 24న విజయవాడ లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇకపై ఆటో, క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చడమే కాకుండా, ప్రాంతీయ చరిత్ర, వారసత్వం, ప్రముఖ పర్యాటక కేంద్రాల విశేషాలను కూడా వివరించనున్నారు.

ఆటో నగర్‌లోని పర్యాటక శాఖ కార్యాలయంలో జరిగిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో 32 మంది క్యాబ్ డ్రైవర్లు, 248 మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. మొత్తం 280 మందికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) శేషగిరి రావు, మార్కెటింగ్ సీఈఓ పద్మరాణి శీల పర్యవేక్షణలో నిర్మాణాత్మక సెషన్లు నిర్వహించారు.

శిక్షణలో భాగంగా కీలక పర్యాటక ప్రదేశాల సమాచారం, వృత్తిపరమైన ప్రవర్తన, భద్రతా ప్రమాణాలు, సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరచే విధానాలు, సాంకేతిక వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. టూరిస్టులతో ఎలా వ్యవహరించాలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు.

అంతర్జాతీయ పర్యాటకులతో సమర్థవంతంగా మాట్లాడేందుకు ‘భాషిణి’ యాప్, గూగుల్ ట్రాన్స్‌లేట్ వంటి అనువాద సాధనాల వినియోగంపై అవగాహన కల్పించారు. స్టోరీ టెల్లింగ్ విధానంలో చారిత్రక ప్రాధాన్యతను వివరించేందుకు జిగ్నాస ఆర్ట్‌వర్స్ సహకారంతో ప్రత్యేక శిక్షణ అందించారు.

అమరావతి, బౌద్ధ సర్క్యూట్, నాగార్జున సాగర్ వంటి గమ్యస్థానాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

పర్యాటకులు శిక్షణ పొందిన డ్రైవర్లను సులభంగా గుర్తించేందుకు Rapido యాప్‌లో ప్రత్యేక టూరిస్ట్ గైడ్ గుర్తును ప్రవేశపెట్టింది. దీని ద్వారా సర్టిఫైడ్ డ్రైవర్లను నేరుగా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.

ఈ ప్రాజెక్ట్ కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ‘స్వదేశ్ దర్శన్’ పథకం కింద, నాగార్జున సాగర్ ఛాలెంజ్-బేస్డ్ డెస్టినేషన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా అమలు అవుతోంది. విజయవాడ పైలట్ మార్చి 6న ముగియనుండగా, వచ్చిన స్పందన ఆధారంగా దీన్ని తిరుపతి, విశాఖపట్నం నగరాలకు విస్తరించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.

పర్యాటక రంగంలో కొత్త దిశగా అడుగులు వేస్తున్న ఈ ప్రయోగం విజయవంతమైతే, రాష్ట్రంలో పర్యాటక సేవలకు కొత్త ఊపిరి తీసుకురానుంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News