హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాధి అవకాశాల శిబిరం విజయవంతం
హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాధి అవకాశాల శిబిరం విజయవంతం
స్థానికం బృందం
52 మంది విద్యార్థులకు నియామక పత్రాలు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్నగర్లో నిర్వహించిన భారీ ఉపాధి అవకాశాల శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో 52 మంది విద్యార్థులకు నియామక పత్రాలు అందజేశారు.
కళాశాల ఆంగ్ల విభాగం, ఉపాధి మార్గదర్శక విభాగం, తెలంగాణ స్కిల్ నాలెడ్జ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో, లక్ష్ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ సంస్థలు అయిన విప్రో, రామోజీ ఫిల్మ్ సిటీ, జస్ట్ డయల్, ముత్తూట్ ఫైనాన్స్ తదితర సంస్థలు పాల్గొని విద్యార్థులను ఎంపిక చేశాయి.
మొత్తం 302 మంది అభ్యర్థులు హాజరుకాగా, వంద మందికి పైగా ఎంపికయ్యారు. అందులో 52 మంది విద్యార్థులు తక్షణ నియామక పత్రాలను స్వీకరించారు. ఇంటర్వ్యూలు, ఎంపిక ప్రక్రియలు రోజంతా ఉత్సాహంగా సాగాయి.
ఈ సందర్భంగా జిల్లా ఉపాధి మరియు శిక్షణాధికారి రవీందర్ మాట్లాడుతూ ఉపాధి ప్రాధాన్యతను వివరించి, ప్రైవేటు రంగంలో అవకాశాలు పొందేందుకు యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేష్ బాబు విద్యార్థులు క్రమశిక్షణ, పని సంస్కృతి అలవర్చుకొని తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని వృత్తి జీవితంలో ముందుకు సాగాలని ప్రోత్సహించారు.
లక్ష్ ఫౌండేషన్ ప్రతినిధి సుమన్ మాట్లాడుతూ యువత ఈ అవకాశాన్ని ప్రారంభంగా తీసుకొని తమ వృత్తి జీవితాన్ని స్థిరపరచుకోవాలని సూచించారు. ఉపాధి మార్గదర్శక విభాగం అధికారి డాక్టర్ ఎ. దుర్గప్రసాద్ ఇటువంటి శిబిరాలు విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయని తెలిపారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి