హామీలకే పరిమితమైన చేనేత రుణమాఫీ – ప్రభుత్వ వైఫల్యం బట్టబయలు
హామీలకే పరిమితమైన చేనేత రుణమాఫీ – ప్రభుత్వ వైఫల్యం బట్టబయలు
స్థానికం బృందం
పాలాభిషేకాలు తప్ప ప్రగతి లేదు – చేనేతపై ప్రభుత్వ చిన్న చూపు
స్థానిక ప్రతినిధి
తెలంగాణలో చేనేత కార్మికులు, చేనేత సహకార సంఘాలు, మొత్తం చేనేత పరిశ్రమ పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా పద్మశాలి తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాలు రూ.33 కోట్లు మాఫీ చేస్తామని ప్రకటించి ఏడాది గడిచిపోయినప్పటికీ, ఆ హామీ కాగితాలకే పరిమితమైందని ఆరోపించారు. అధికారులు డబ్బులు విడుదల చేశామని చెబుతున్నా, ఇప్పటికీ చేనేత కార్మికులకు రుణమాఫీ అమలుకాకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు.
మరోవైపు, చేనేత సహకార సంఘాలకు గత 13 సంవత్సరాలుగా ఎన్నికలు జరగకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సంఘాల సమస్యలను పట్టించుకునే దిక్కులేని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత సహకార సంఘాలకు సంబంధించిన సుమారు రూ.50 కోట్ల క్యాష్ క్రెడిట్ రుణాలను మాఫీ చేసి, సంఘాలకు పూర్వ వైభవం తీసుకురావాలని ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కోరినా స్పందన లేదని మండిపడ్డారు.
వేల కోట్ల రూపాయల రుణమాఫీలు చేస్తున్న ప్రభుత్వం, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత పరిశ్రమకు సంబంధించిన ఈ చిన్న రుణాలను మాఫీ చేయడంలో చూపుతున్న నిర్లక్ష్యం, పద్మశాలి సమాజం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిన్న చూపునే స్పష్టం చేస్తోందని విమర్శించారు.
ఇదే నిర్లక్ష్య ధోరణి కొనసాగితే రానున్న రోజుల్లో ప్రభుత్వం తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చేనేత కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి