Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 08:08 AM

గ్రామ పాలన పటిష్టతకు సర్పంచ్‌లకు అవగాహన తరగతులు

గ్రామ పాలన పటిష్టతకు సర్పంచ్‌లకు అవగాహన తరగతులు

గ్రామ పాలన పటిష్టతకు సర్పంచ్‌లకు అవగాహన తరగతులు
January 15, 2026 04:54 PM 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sangareddy & Manoor
Sthanikam District Staff Reporter krishna

జిల్లాల వారీగా సర్పంచ్‌లకు శిక్షణ తరగతులు

రాష్ట్ర స్థానికం ప్రతినిధి :తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్‌లకు సమగ్ర శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రామ పాలన మరింత పారదర్శకంగా, సమర్థంగా సాగాలనే లక్ష్యంతో ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ శిక్షణలు జరగనున్నాయి. జనవరి 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లకు గ్రామ పాలనలో వారి విధులు, బాధ్యతలు, అధికారాలు, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ చట్టంపై సమగ్ర అవగాహన కల్పించనున్నారు.ఈ శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా సర్పంచ్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మార్గదర్శక పుస్తకాన్ని కూడా అందజేయనున్నారు. ఇందులో గ్రామ పంచాయతీ నిర్వహణకు అవసరమైన పూర్తి సమాచారం పొందుపరిచారు.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,760 మంది సర్పంచ్‌లకు ఈ శిక్షణ అందించనున్నారు. జిల్లాల వారీగా శిక్షణ తరగతులు నిర్వహిస్తూ, ప్రతి జిల్లాలో సర్పంచ్‌లను ఐదు బృందాలుగా విభజిస్తారు. ఒక్కో బృందానికి ఐదు రోజులపాటు శిక్షణ అందించనున్నారు. ప్రతి బృందంలో కనీసం 50 మంది సర్పంచ్‌లు పాల్గొంటారు.శిక్షణా కాలంలో సర్పంచ్‌లకు వసతి, భోజనం, ఇతర అవసరాల కోసం ఒక్కో సర్పంచ్‌పై ప్రభుత్వం రూ.5,000 వరకు ఖర్చు చేయనుంది. ఈ శిక్షణను సమర్థంగా నిర్వహించేందుకు మొత్తం 253 మంది ప్రధాన శిక్షకులను ఎంపిక చేశారు. వీరికి ఇప్పటికే తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో అవగాహన కార్యక్రమం పూర్తయింది.ఈ ప్రధాన శిక్షకులు గ్రామ పాలన, అభివృద్ధి కార్యక్రమాలు, ఆర్థిక నిర్వహణ, ప్రజలకు సేవలందించే విధానాలపై సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాలు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.ఈ శిక్షణా కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో పారదర్శకతతో కూడిన పాలన కొనసాగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామ అభివృద్ధి పనులు మరింత సమర్థవంతంగా అమలయ్యే అవకాశాలు ఉంటాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇక, గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధుల కోసం రూపొందించిన మార్గదర్శక పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఆవిష్కరించిన విషయం తెలిసిందే. పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం గ్రామ పంచాయతీల విధులు, బాధ్యతలపై 292 పేజీలతో ఈ పుస్తకాన్ని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థ రూపొందించింది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News