గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
GADDAM JAGANMOHAN REDDY
వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై ప్రజల్లో ఉన్న ఆందోళనను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం ఆన్లైన్లో వెతికే అమాయకులనే లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తక్షణమే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తామని, అదనపు సిలిండర్లు అందిస్తామని సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. అలాగే వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా ఫేక్ వెబ్సైట్ లింకులను పంపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు.
ఆన్లైన్లో ముందుగా డబ్బులు చెల్లిస్తే గ్యారెంటీగా, అత్యవసరంగా గ్యాస్ సరఫరా చేస్తామని వచ్చే సందేశాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. అలాంటి లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని స్పష్టం చేశారు.
గ్యాస్ సిలిండర్ బుకింగ్ లేదా చెల్లింపులు చేయాలనుకునే వారు సంబంధిత గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్సైట్లు లేదా అధీకృత గ్యాస్ ఏజెన్సీలను మాత్రమే ఆశ్రయించాలని తెలిపారు. ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి గుర్తు తెలియని వ్యక్తులకు బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ వంటి వ్యక్తిగత సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని హెచ్చరించారు.
నకిలీ వెబ్సైట్లలో వివరాలు నమోదు చేస్తే వ్యక్తిగత, ఆర్థిక సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపారు. ఫలితంగా బ్యాంక్ ఖాతాల్లోని డబ్బు కోల్పోయే అవకాశముందని హెచ్చరించారు.
ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ మోసాలకు గురైతే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ 1930 కు కాల్ చేయాలని సూచించారు. అలాగే cybercrime.gov.in వెబ్సైట్లో కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి