గ్రామాల్లో పులి సంచారం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్
గ్రామాల్లో పులి సంచారం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్
స్థానికం బృందం
జిల్లాలోని కొన్ని గ్రామాల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు.మంగళవారం రాజాపేట మండలం బసంతాపూర్ గ్రామంలో గత రాత్రి పులి దాడిలో మృతి చెందిన లేగ దూడ సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అటవీ అధికారులతో పులి సంచారం, నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించారు.కలెక్టర్ మాట్లాడుతూ, ఇటీవల గ్రామాల సమీపంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో దానిని పట్టుకునేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. పులి కదలికలను గుర్తించేందుకు థర్మల్ డ్రోన్ల ద్వారా వీడియో చిత్రీకరణ, ట్రాప్ కెమెరాల ఏర్పాటు, అలాగే పులిని బంధించేందుకు ప్రత్యేక బోన్ల ఏర్పాటు చేసినట్లు అటవీ అధికారులు కలెక్టర్కు వివరించారు.
అడవి ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకూడదని, వ్యవసాయ పనుల కోసం వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని సూచించారు. అలాగే రాత్రి సమయంలో పశువులను బయటికి వదలకుండా, పశువుల పాకలో తగిన వెలుతురు ఉండేలా చూసుకోవాలని అన్నారు.
పులి కనిపించినట్లుగా గమనించిన వెంటనే అటవీ శాఖ అధికారులు లేదా స్థానిక గ్రామ పోలీసులకు సమాచారం అందించాలని, పులికి దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేయరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం, అటవీ శాఖ సిబ్బంది పులి అడుగు జాడలను నిరంతరం గమనిస్తూ, దానిని పట్టుకొని అడవిలోకి పంపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రజలు భయాందోళనకు గురి కాకుండా, అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి