గణిత పాఠం చెప్పిన కలెక్టర్… ఆశ్చర్యపోయిన విద్యార్థులు!
గణిత పాఠం చెప్పిన కలెక్టర్… ఆశ్చర్యపోయిన విద్యార్థులు!
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీలో భాగంగా బుధవారం యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ను సందర్శించారు. అయితే ఈ తనిఖీ ప్రత్యేకత ఏమిటంటే… కలెక్టర్ స్వయంగా గణిత ఉపాధ్యాయుడిగా మారి పదవ తరగతి విద్యార్థులకు పాఠం బోధించడం!
పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య, పదవ తరగతి చదువుతున్న వారి వివరాలు, సబ్జెక్టుల వారీగా సిలబస్ పూర్తయిందా లేదా అనే అంశాలపై ఆరా తీశారు. ప్రతిరోజూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారా? ఉదయం 5 గంటలకు విద్యార్థులకు వేకప్ కాల్ ఇస్తున్నారా? అంటూ ఉపాధ్యాయులను ప్రశ్నించారు.
అనంతరం 10వ తరగతి విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి గణితంలో సూటి ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు సమాధానాలు చెప్పిన తర్వాత బోర్డు పై స్వయంగా సమస్యలను పరిష్కరిస్తూ సులభంగా అర్థమయ్యే విధంగా బోధించారు. కలెక్టర్ బోధనకు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు.
“పదవ తరగతి జీవితాన్ని మలిచే మొదటి మెట్టు. ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదివితే 100 శాతం ఉత్తీర్ణత సాధించవచ్చు. వెనుకబడిన సబ్జెక్టులపై మరింత శ్రద్ధ పెట్టాలి. స్వయంగా వ్రాసి సాధన చేయాలి” అని సూచించారు.
“బీద కుటుంబం నుండి ఉన్నత స్థాయికి తీసుకెళ్లేది చదువే. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందుతోంది. ప్రతి గ్రామంలో ప్రతి విద్యార్థి ప్రభుత్వ బడిలోనే చదువుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి” అని కలెక్టర్ స్పష్టం చేశారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి