ఏపీ సీఎస్పై హైకోర్టు ఆగ్రహ జ్వాలలు “ఆదేశాలు అమలు చేయకపోతే జైలుకే” – ఘాటు హెచ్చరిక
ఏపీ సీఎస్పై హైకోర్టు ఆగ్రహ జ్వాలలు “ఆదేశాలు అమలు చేయకపోతే జైలుకే” – ఘాటు హెచ్చరిక
GADDAM JAGANMOHAN REDDY
అమరావతి, బుధవారం: గ్రూప్-1 నియామకాల వ్యవహారం రాష్ట్ర పరిపాలనలో ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసు విచారణలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల అమలులో జాప్యం జరగడంపై ధర్మాసనం నిప్పులు చెరిగింది.
“తక్షణం అంటే అర్థం తెలియదా?” అంటూ ధర్మాసనం ఘాటుగా ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుని జైలుకు పంపాల్సి వస్తుందని హెచ్చరించింది. నాన్-ఫోకల్ పోస్టులకు బదిలీ చేయాలన్న ఆదేశాలు
గ్రూప్-1 ద్వారా ఎంపికైన అధికారులను దర్యాప్తును ప్రభావితం చేయని అప్రాధాన్య పోస్టులకు వెంటనే బదిలీ చేయాలని గతంలో కోర్టు స్పష్టం చేసింది. అయితే ఆ ఆదేశాలు అమలుకాకపోవడంపై సీఎస్ను న్యాయమూర్తులు నిలదీశారు.
“సీఎస్ కోర్టు ఆదేశాలను గౌరవించకపోతే కింది స్థాయి అధికారులు ఏం నేర్చుకుంటారు?”
అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
“మేనేజ్ చేశారా?” – ధర్మాసనం ప్రశ్న
డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీల వంటి కీలక స్థానాల్లో ఉన్నవారిని ఎందుకు బదిలీ చేయలేదని ప్రశ్నించిన ధర్మాసనం,
“అభ్యర్థులు మిమ్మల్ని మేనేజ్ చేశారా? లేక కుమ్మక్కయ్యారా?”
అని సూటిగా వ్యాఖ్యానించింది.
ప్రభుత్వ వాదన తిరస్కరణ
ఫోకల్, నాన్-ఫోకల్ పోస్టుల నిర్వచనంపై స్పష్టత లేనందున న్యాయసలహా కోరామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదించారు. ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది.
“ఏఐని అడిగినా అర్థం చెబుతుంది, మీకే తెలియదా?”
అంటూ ఎద్దేవా చేసింది.
గురువారానికి గడువు
“జైలుకు వెళ్తారా? లేక ఆదేశాలు అమలు చేస్తారా?” అని ప్రశ్నించగా, గురువారం నాటికి ఉత్తర్వులు అమలు చేసి నివేదిక సమర్పిస్తామని సీఎస్ హామీ ఇచ్చారు.
బట్టు దేవానంద్, హరిహరనాథశర్మలతో కూడిన ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఆదేశాలు అమలు చేస్తే సీఎస్ వ్యక్తిగత హాజరు అవసరం లేదని స్పష్టం చేసింది. న్యాయస్థాన ఆదేశాల అమలులో నిర్లక్ష్యం సహించబోమన్న సందేశాన్ని హైకోర్టు ఈ విచారణ ద్వారా బలంగా ఇచ్చింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి