ఏపీ అసెంబ్లీలో జైళ్ల సంస్కరణల బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
ఏపీ అసెంబ్లీలో జైళ్ల సంస్కరణల బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
GADDAM JAGANMOHAN REDDY
ఖైదీల క్షమాభిక్షపై హోంమంత్రి కీలక ప్రకటన
అమరావతి: బడ్జెట్ సమావేశాల ఎనిమిదో రోజున రాష్ట్ర జైళ్ల వ్యవస్థలో సమగ్ర మార్పులకు దారితీసే ‘జైళ్లు, సంస్కరణల చట్టం సవరణ బిల్లు’ను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రవేశపెట్టిన ఈ బిల్లుతో జైళ్లను శిక్షాకేంద్రాలుగా కాకుండా సంస్కరణాలయాలుగా రూపాంతరం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
“శిక్ష కాదు... సంస్కరణే లక్ష్యం”
సభలో మాట్లాడిన హోంమంత్రి అనిత, ఖైదీలలో మానసిక పరివర్తన తీసుకురావడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. సత్ప్రవర్తన కనబరిచిన ఖైదీలకు క్షమాభిక్ష కల్పించే అంశంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన చట్టాల మేరకు రాష్ట్రంలోనూ సంస్కరణలు అమలు చేస్తామని తెలిపారు.
ఓపెన్ ఎయిర్ జైళ్లు – వృత్తి విద్యకు ప్రాధాన్యం
ఖైదీల నేరచరిత్ర, ప్రవర్తన ఆధారంగా కేటగిరీలుగా విభజించి ‘ఓపెన్ ఎయిర్ జైళ్ల’ను అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి వెల్లడించారు. జైలు శిక్ష అనంతరం సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు వ్యవసాయం, వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ అందించడంతో పాటు చదువు కొనసాగించేందుకు అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
వృద్ధ ఖైదీలకు ఉపశమనం?
60 ఏళ్లు దాటిన వృద్ధ ఖైదీలు, చిన్నచిన్న కేసుల్లో ఇరుక్కున్న వారికి సత్ప్రవర్తన ప్రాతిపదికన క్షమాభిక్ష ఇవ్వాలని సభలో సభ్యులు కోరారు. ఖైదీలు విడుదలైన తరువాత సమాజంలో తిరిగి కలిసేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
బిల్లు ఆమోదం పొందడంతో రాష్ట్రంలోని వందలాది మంది ఖైదీలకు విముక్తి దిశగా మార్గం సుగమం కానున్నది. జైళ్ల వ్యవస్థలో ఈ మార్పులు అమలులోకి వస్తే, ఖైదీల పునరావాసానికి ఇది మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి