ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్లు డిస్మిస్
ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్లు డిస్మిస్
GADDAM JAGANMOHAN REDDY
హైదరాబాద్: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్లను తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ డిస్మిస్ చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని పేర్కొంటూ ఈ నిర్ణయం వెల్లడించారు. గురువారం సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణ ఉండటంతో సభాపతి ముందుగానే తీర్పును ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లిన్చిట్ ఇచ్చినట్లైంది.
దానం నాగేందర్ స్పందన
తనపై వచ్చిన అనర్హత పిటిషన్ను స్పీకర్ డిస్మిస్ చేయడంతో ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి తనను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సీఎం పదవి లేకపోయినా ఇబ్బంది లేదని, కానీ కల్వకుంట్ల తారక రామారావుకు మాత్రం అది పెద్ద సమస్యగా మారిందని వ్యాఖ్యానించారు. తాను ఎక్కడా పార్టీ సభ్యత్వం మార్చుకోలేదని, సభలో ఎక్కడా విప్కు వ్యతిరేకంగా వ్యవహరించలేదని తెలిపారు. తనపై వ్యతిరేక తీర్పు వచ్చినా ఉపఎన్నికల్లో గెలిచేవాడినని ఆయన పేర్కొన్నారు. సీఎం అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
స్పీకర్ తీర్పును స్వాగతించిన కడియం శ్రీహరి
స్పీకర్ తీర్పును ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్వాగతించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన అనర్హత పిటిషన్ చట్టబద్ధం కాదని తెలిపారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నేతలను బీఆర్ఎస్లో చేర్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఫిరాయింపులపై మాజీ సీఎం కేసీఆర్ ప్రజలకు క్షమాపణలు చెబితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికకు సిద్ధమని పేర్కొన్నారు. తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని, పార్టీ నాయకత్వానికి మాత్రమే దూరంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
కేటీఆర్ విమర్శలు
ఇక స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు తీవ్రంగా స్పందించారు. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలకు క్లీన్చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై దాడి అని పేర్కొన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా నిలిచిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి