భూ వివాదాలకు చెక్… భూభారతి పోర్టల్కు శ్రీకారం
భూ వివాదాలకు చెక్… భూభారతి పోర్టల్కు శ్రీకారం
Editor Desk
రేపటి నుంచి 5 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం
రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు రెవెన్యూ శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ క్రమంలో భూమి, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ ‘ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్’ను రూపొందించినట్లు తెలిపారు.
ఇంటి నుంచే భూ సేవలు
రైతులు ఇకపై మీ సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా స్మార్ట్ఫోన్ ద్వారానే భూ సేవలు పొందేలా ఈ పోర్టల్ రూపొందించారు. రైతు లాగిన్ అయిన వెంటనే తన భూమి వివరాలు, సర్వే అవసరాలు, ఫీజులు అన్నీ కనిపిస్తాయి.
2 రోజుల్లో నోటీసులు… 7 రోజుల్లో సర్వే
దరఖాస్తు చేసిన వెంటనే సంబంధిత సర్వేయర్కు సమాచారం చేరుతుంది. రెండు రోజుల్లో పొరుగు రైతులకు నోటీసులు జారీ చేసి, 7 రోజుల్లో సర్వే పూర్తి చేస్తారు. రోవర్ టెక్నాలజీతో ఖచ్చితమైన సర్వే నిర్వహిస్తారు.
ఎల్పిఎమ్, భూధార్ నంబర్లు
సర్వే పూర్తయ్యాక ప్రతి భూమికి యూనిక్ ఎల్పిఎమ్ నంబర్, ప్రతి సర్వే నంబర్కు ఆధార్ తరహాలో భూధార్ నంబర్ కేటాయిస్తారు. సర్వే మ్యాప్ను పోర్టల్లో అప్లోడ్ చేస్తారు.
ప్రతి దశలో SMS అలర్ట్స్
దరఖాస్తు నుంచి రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు ప్రతి దశలో రైతులకు మొబైల్కు SMS అలర్ట్స్ పంపిస్తారు.
పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం
ఏప్రిల్ 2 నుంచి ఖమ్మం (కుసుమంచి), భద్రాద్రి కొత్తగూడెం (అశ్వారావుపేట), రంగారెడ్డి (అమనగల్), సంగారెడ్డి (వట్పల్లి), నారాయణపేట (కొస్గి) మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.
పాత పరికరాలకు గుడ్బై
గొలుసులు, కర్రలు వంటి పాత పరికరాల స్థానంలో ఆధునిక రోవర్ టెక్నాలజీతో వేగంగా, ఖచ్చితంగా సర్వేలు నిర్వహించనున్నారు.
“రైతు ఇంటి నుంచే సేవలు… పారదర్శక వ్యవస్థ”
భూ సమస్యలు రైతు జీవితంలో పెద్ద అడ్డంకిగా మారాయని, వాటికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా భూభారతి పోర్టల్ కీలకమని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇది రెవెన్యూ వ్యవస్థలో చారిత్రాత్మక మార్పుకు నాంది అవుతుందని చెప్పారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి