ఆసుపత్రుల పనితీరుపై మంత్రి కొలుసు పార్ధసారధి ఆగ్రహం.
ఆసుపత్రుల పనితీరుపై మంత్రి కొలుసు పార్ధసారధి ఆగ్రహం.
GADDAM JAGANMOHAN REDDY
నూజివీడు వైద్యసేవలపై తీవ్ర అసంతృప్తి – నెలరోజుల్లో మార్పు లేకపోతే కఠిన చర్యలు హెచ్చరిక
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవల దారుణ స్థితిపై రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన నివేదిక ఆధారంగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆసుపత్రుల పనితీరును తీవ్రంగా తప్పుబట్టారు.
నియోజకవర్గంలోని ఏరియా ఆసుపత్రిలో వైద్యుల హాజరు సరిగా లేకపోవడం, రోగులకు తగిన సేవలు అందకపోవడం, పారిశుధ్యం, ఆహారం, మరుగుదొడ్ల నిర్వహణ వంటి అంశాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని నివేదిక వెల్లడించిందన్నారు. మొత్తం పనితీరు కేవలం అరవై మూడు శాతం మాత్రమే సంతృప్తికరంగా ఉండడం పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో చూపుతోందని వ్యాఖ్యానించారు.
జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో పనితీరు డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు మెరుగ్గా ఉండగా, ఇక్కడ మాత్రం పరిస్థితి వెనుకబడిందని మండిపడ్డారు. ఒక నెలలోగా పరిస్థితి మారకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
వైద్యులు అందుబాటులో లేకపోవడం, సేవల కోసం లంచాలు కోరుతున్నారనే ఫిర్యాదులు వస్తే వెంటనే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. రోగులకు అవసరమైన మందులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని, కొరత ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.
ఆసుపత్రి పరిసరాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని, అందించే ఆహారం, ఇతర సౌకర్యాలపై ప్రతిరోజూ పర్యవేక్షణ ఉండాలని సూచించారు. రోగుల సేవల్లో పారదర్శకత కోసం పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని, నిఘా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
లంచాలు తీసుకోవడం నేరమని స్పష్టంగా ప్రకటిస్తూ హెచ్చరికలు ప్రదర్శించాలని, ప్రజలకు ఫిర్యాదు చేసే అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. తాను ఎప్పుడైనా ఆకస్మికంగా తనిఖీకి వస్తానని, అప్పటికీ పరిస్థితి మారకపోతే కఠిన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి వెనుకంజ ఉండదని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో వైద్యాధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి