అల్పపీడనాలు- ఫిబ్రవరి 19కి తర్వాత తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్
అల్పపీడనాలు- ఫిబ్రవరి 19కి తర్వాత తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్
GADDAM JAGANMOHAN REDDY
ఫిబ్రవరిలో వాతావరణంలో మార్పు వస్తుంది. ఒకవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతూ వేసవి వచ్చేస్తుందని హెచ్చరిస్తుంటే.. మరోవైపు వాతావరణ శాఖ ఐఎండీ.. ఈ నెలలోనే రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఇందులో మొదటి అల్పపీడనం నేడు లేదా రేపు అంటే ఫిబ్రవరి 17న దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడనుండగా, రెండోది 19వ తేదీ తర్వాత ఏర్పడే అవకాశం ఉంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉండటం వల్లే ఇలా అరుదైన రీతిలో అల్పపీడనాలు ఏర్పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఈ మొదటి వ్యవస్థ ప్రభావం ప్రధానంగా తమిళనాడు, శ్రీలంక ప్రాంతాలపైనే ఉంటుంది. తెలుగు రాష్ట్రాలపై దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అయితే, ఫిబ్రవరి 19 తర్వాత ఏర్పడే రెండో వాతావరణ వ్యవస్థ మాత్రం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపనుంది. బంగాళాఖాతంలో ఏర్పడే ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నాయి. దీని ఫలితంగా ఫిబ్రవరి 25 నుంచి 28 మధ్య తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవవచ్చు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఫిబ్రవరి చివరి వారంలో దక్షిణ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ నివేదికలు ద్వారా తెలుస్తోంది.
అకాల వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా కోతకు వచ్చిన పంటలు, ఆరబెట్టిన ధాన్యం తడిసిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసేవారు, పశువుల కాపరులు చెట్ల కింద తలదాచుకోవద్దని హెచ్చరించింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి