అక్రిడిటేషన్లు తగ్గవు.. మరింత పెరుగుతాయి జీవో–262లో మార్పులు తప్పవు: మంత్రి పొంగులేటి స్పష్టం
అక్రిడిటేషన్లు తగ్గవు.. మరింత పెరుగుతాయి జీవో–262లో మార్పులు తప్పవు: మంత్రి పొంగులేటి స్పష్టం
Editor Desk
జర్నలిస్టుల సంఘాలతో భేటీలో కీలక హామీలు
హైదరాబాద్ స్థానిక ప్రధాన ప్రతినిధి
జర్నలిజం గౌరవాన్ని నిలబెట్టే పాత్రికేయులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని సమాచార, పౌరసంబంధాలు, రెవెన్యూ–హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పాత్రికేయ వృత్తికి వన్నెతెచ్చే ప్రతి జర్నలిస్టుకు అండగా ఉంటుందని తెలిపారు.శనివారం సచివాలయంలో జీవో–262పై 14 జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టు సంఘాలు ఇచ్చిన సూచనలు, సలహాలను ప్రభుత్వం సీరియస్గా పరిగణిస్తోందన్నారు. అన్ని అంశాలను పరిశీలించి జీవో–262లో అవసరమైన మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు.అక్రిడిటేషన్ కార్డులు తగ్గుతాయన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని మంత్రి కొట్టిపారేశారు. గతంలో ఉన్న సుమారు 23 వేల అక్రిడిటేషన్ కార్డుల కంటే ఈసారి మరింత సంఖ్యలో జారీ చేస్తామని స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ కార్డుల జారీలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. మీడియా కార్డు, అక్రిడిటేషన్ కార్డు మధ్య ఎలాంటి తేడా లేదని చెప్పారు.పాత్రికేయ వ్యవస్థను గాడిలో పెట్టేందుకే సర్క్యులేషన్, ఇతర వివరాలను కచ్చితంగా సేకరిస్తామని, సీఏ సర్టిఫికెట్లను కూడా పరిశీలిస్తామని తెలిపారు. అక్రిడిటేషన్ కమిటీల్లో ఉర్దూ జర్నలిస్టులకు ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పారు. క్రీడా, సాంస్కృతిక, క్రైమ్, కేబుల్ టీవీ తదితర విభాగాల జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు.
సమావేశంలో పలువురు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ఇండ్లస్థలాలు, పెన్షన్, బస్పాసులు, బీమా వంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వీటన్నింటినీ దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి, సమాచార శాఖ కమిషనర్ సిహెచ్ ప్రియాంక, ముఖ్యమంత్రి సీపీఆర్వో గుర్రం మల్పూర్, సమాచార శాఖ జేడీ జగన్, ఏడీ యామిని పాల్గొన్నారు. వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు అల్లం నారాయణ, బసవపున్నయ్య, విరాహత్ అలీ, కెఎన్ హరి, మారుతిసాగర్, రాంనారాయణ, తాటికొండ కృష్ణ, శ్రీనివాస్, మస్తాన్, ఉపేందర్ తదితరులు హాజరయ్యారు.
ఇండ్లస్థలాల సమస్యకు పరిష్కారం కోరిన ఫెడరేషన్
జర్నలిస్టు సంఘాల సమావేశంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇండ్లస్థలాల సమస్యను ప్రస్తావించారు. ఏండ్ల తరబడి ఇండ్లస్థలాల కోసం జర్నలిస్టులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కొత్త విధానం తీసుకొచ్చి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు.
హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్లతో సంబంధం లేకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ సమానంగా ఇండ్లస్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దీనిపై స్పందించిన మంత్రి పొంగులేటి ఎలాంటి అడ్డంకులు లేని విధానాన్ని ప్రభుత్వం తీసుకువస్తుందని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుతో సమస్య మళ్లీ మొదటికొచ్చిందని, అయినప్పటికీ త్వరలోనే సమగ్ర పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. జీవో–262ను సవరించి జర్నలిస్టులకు న్యాయం చేస్తామని, విభజనకు తావులేకుండా అందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ కార్డుల సంఖ్య పెంచాలని, జర్నలిస్టుల బస్పాసులకు ప్రత్యేక రంగు ఇవ్వాలని కూడా సమావేశంలో సూచనలు వచ్చాయి. పాత్రికేయ రంగం పుంతలు తొక్కుతున్న తరుణంలో అక్రిడిటేషన్లు తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి