అక్రెడిటేషన్ జీఓపై అపోహలు వద్దు.. వృత్తిపర జర్నలిస్టులకు పూర్తి భరోసా
అక్రెడిటేషన్ జీఓపై అపోహలు వద్దు.. వృత్తిపర జర్నలిస్టులకు పూర్తి భరోసా
స్థానికం బృందం
అక్రెడిటేషన్ మార్గదర్శకాలపై అపోహలు వద్దు – స్పష్టం చేసిన మీడియా అకాడమీ చైర్మన్
స్థానిక ప్రతినిధి హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన అక్రెడిటేషన్ మార్గదర్శకాలు వృత్తిపరమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం చేయవని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారు. జర్నలిస్టుల మధ్య ఏ విధమైన వివక్షత లేకుండా సంక్షేమ చర్యలు అందరికీ వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టుల సంక్షేమాన్ని మరింత మెరుగుపర్చే దిశగా ఆలోచిస్తున్నారని వెల్లడించారు. గతంలో ఉర్దూ జర్నలిస్టులపై జరిగిన వివక్ష, చిన్న పత్రికల పట్ల చూపిన నిర్లక్ష్యాన్ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలోనే ఈ కొత్త జీఓలో మార్పులు తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు.
నూతన జీఓపై కొందరు ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, సంక్షేమ చర్యలు కేవలం కొందరికే వర్తిస్తాయని వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని, వృత్తిపరమైన జర్నలిస్టులందరికీ ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
ఈ అంశాలపై అవసరమైతే స్పష్టత కోరవచ్చని, జర్నలిస్టుల సంక్షేమంపై ముఖ్యమంత్రి, సమాచార శాఖ మంత్రితో ఎప్పుడైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే, దీనికి విరుద్ధంగా రాజకీయ ఎత్తుగడతో కొన్ని శక్తులు ఆందోళనలు సృష్టించడం అత్యంత విచారకరమని వ్యాఖ్యానించారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం సానుకూలంగా ఉందని, గత ప్రభుత్వాల మాదిరిగా వివక్ష చూపే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. నూతన జీఓపై పనిగట్టుకొని జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి