అగ్నిగుండాలు గెలుపుతో మల్లన్న బ్రహ్మోత్సవాలకు ఉత్సాహభరిత ముగింపు
అగ్నిగుండాలు గెలుపుతో మల్లన్న బ్రహ్మోత్సవాలకు ఉత్సాహభరిత ముగింపు
స్థానికం బృందం
రామన్నపేట, నిధానపల్లి:
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిధానపల్లి గ్రామంలోని మల్లన్నగుట్టపై స్వయంభూగా వెలసిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తి ఉత్సాహాల నడుమ ఘనంగా ముగిశాయి. “చిన్న శ్రీశైలం”గా పేరుగాంచిన ఈ పవిత్ర క్షేత్రం బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయింది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పాదార్చనాభిషేకం, దివ్య కళ్యాణం (తలంబ్రాలు) వేదఘోషాలు, మంగళవాయిద్యాల నడుమ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ వేళ ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోయింది. భక్తుల ‘ఓం నమశ్శివాయ’ నినాదాలు గుట్టంతా మారుమోగించాయి.
అగ్నిగుండాలు ప్రధాన ఆకర్షణ
బ్రహ్మోత్సవాల హైలెట్గా నిలిచింది అగ్నిగుండాల కార్యక్రమం. తెల్లవారుజామున నిర్వహించిన ఈ విశిష్ట ఆచారంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ఎర్రటి అగ్నిగుండాలను ధైర్యంగా అధిగమిస్తూ భక్తులు చూపిన ఆత్మస్థైర్యం, విశ్వాసం అక్కడి వాతావరణాన్ని ఉత్కంఠభరితంగా మార్చింది. ‘హర హర మహాదేవ’ నినాదాలతో మల్లన్నగుట్ట దద్దరిల్లింది.
కొండపై ఉన్న పవిత్ర కోనేటి స్నానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ కోనేటిలో స్నానం చేస్తే రోగాలు నివారించి శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. కొండల గుహల్లో మునులు తపస్సు చేసిన ప్రదేశాలున్నాయని స్థానికులు విశ్వసిస్తున్నారు.
పూజా కార్యక్రమాలు “స్వర్ణసింహబ్రహ్మకంకణ పురస్కృతులు”, “శతాధిక ప్రతిష్టాచార్య” సిద్ధాంత కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ బేతోజు సత్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి. అనంతరం త్రిశూల స్నానం, గెలుపు ఉత్సవం, ఉత్సవ సమాప్తి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
ముగింపులో గ్రామ పెద్దలు, దాతలను సన్మానించనున్నారు. అగ్నిగుండాల గెలుపుతో ముగిసిన ఈ బ్రహ్మోత్సవాలు భక్తి, విశ్వాసాలకు ప్రతీకగా నిలిచి నిధానపల్లి గ్రామాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా మరోసారి నిలబెట్టాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి