45 రోజుల్లో వివరాలు ఇవ్వకపోతే పదవికే గండం
45 రోజుల్లో వివరాలు ఇవ్వకపోతే పదవికే గండం
Editor Desk
పంచాయతీ ఎన్నికలు ముగిశాయి..
గెలిచిన వారికి మొదలైన కొత్త పరేషాన్..!
ఖర్చుల లెక్కలతో సతమతం అవుతున్న పాలకవర్గం
తెలంగాణ స్థానికం ప్రధాన ప్రతి నిధి
45 రోజుల్లో వివరాలు ఇవ్వకపోతే పదవికే గండం
గ్రామాల్లో కొత్త పంచాయతీల పాలకవర్గం కొలువుదీరింది. గత నెల డిసెంబరు 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికైన సర్పంచ్లు, వార్డు సభ్యులు ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేసి పాలన సాగిస్తున్నారు. అయితే, ఎన్నికలు ముగిసిన తర్వాత గెలుపొందిన అభ్యర్థులకు ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది.
ఎన్నికల్లో ఎంత ఖర్చు చేశారన్న పూర్తి వివరాలను సమర్పించాలంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో సర్పంచ్లు, వార్డు సభ్యులు సతమతమవుతున్నారు. ఎన్నికల రోజు నుంచి 45 రోజుల్లోగా ఖర్చుల లెక్కలను సమగ్రంగా ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో వివరాలు ఎలా సమర్పించాలన్న దానిపై గెలుపొందిన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.
నిబంధనలు ఒకలా.. ఖర్చు మరోలా!
పంచాయతీ ఎన్నికల్లో ఖర్చుకు సంబంధించి ఎన్నికల సంఘం స్పష్టమైన పరిమితులు విధించింది.
5 వేలకుపైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో
సర్పంచ్ అభ్యర్థికి రూ.2.50 లక్షలు
వార్డు సభ్యుడికి రూ.50 వేలు
5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో
సర్పంచ్ అభ్యర్థికి రూ.1.50 లక్షలు
వార్డు సభ్యుడికి రూ.30 వేలు
మాత్రమే ఖర్చు చేయాలనే నిబంధన ఉంది. అయితే ఈ నిబంధనలు వాస్తవంలో అమలయ్యాయా అంటే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. మేజర్ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వార్డు సభ్యులు కూడా లక్ష నుంచి మూడు లక్షల వరకు ఖర్చు చేసినట్లు చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం లెక్కలను ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై గెలుపొందిన అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ‘కాకి లెక్కలు’ తయారుచేసి మమ అనిపించాలన్న ప్రయత్నాలు సాగుతున్నట్లు గ్రామాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
గడువు దగ్గరపడుతోంది..
ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించేందుకు ఎన్నికల సంఘం కేవలం 45 రోజుల గడువు మాత్రమే ఇచ్చింది.మూడు విడతల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించితొలి విడతలో గెలిచిన వారు జనవరి 24లోపురెండో విడతలో గెలిచిన వారు జనవరి 27లోపు
మూడో విడతలో గెలిచిన వారు జనవరి 30లోపు
తమ ఖర్చుల వివరాలను సంబంధిత ఎంపీడీవో కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారులు, మండల స్థాయి అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అనేక మండలాల్లో గెలుపొందిన సర్పంచ్లు, వార్డు సభ్యులకు ఎంపీడీవోలు నోటీసులు పంపినట్లు సమాచారం.
నిర్లక్ష్యం చేస్తే అనర్హత తప్పదు!
ఎన్నికల్లో గెలిచాం.. ఇక అంతే అనుకుంటే పొరపాటేనని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఖర్చుల వివరాలపై ఎన్నికల సంఘం క్షుణ్ణంగా పరిశీలన చేస్తుందని స్పష్టం చేస్తున్నారు. గడువు లోపే వివరాలు సమర్పించకపోతే గెలుపొందిన వారిపై అనర్హత వేటు పడే అవకాశముందని చెబుతున్నారు.అంతేకాదు.. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు కూడా తమ ఖర్చుల వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి. లెక్కలు ఇవ్వని అభ్యర్థులు వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కోల్పోతారని అధికారులు వెల్లడించారు. మూడేళ్లపాటు ఎన్నికలకు అనర్హులవుతారని స్పష్టం చేశారు.
మొత్తంగా పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆనందం ఇంకా తీరకముందే, ఖర్చుల లెక్కలు కొత్త పాలకవర్గానికి పెద్ద పరీక్షగా మారాయి. గ్రామ రాజకీయాల్లో ఈ లెక్కల వ్యవహారం ఎటు దారి తీస్తుందో చూడాలి.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి