యాదాద్రి ఆలయంలో చేతివాటం బంగారం వెండి డాలర్లు మాయం
యాదాద్రి ఆలయంలో చేతివాటం బంగారం వెండి డాలర్లు మాయం
Komidala Mahender reddy
స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.
రూ.22 లక్షల విలువైన బంగారం–వెండి డాలర్లు మాయం
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో మరోసారి ఇంటి దొంగల వ్యవహారం కలకలం రేపుతోంది. ఆలయ ప్రచార శాఖ ద్వారా విక్రయించే బంగారం, వెండి డాలర్లు భారీగా మాయమైనట్టు అధికారులు ఆడిట్లో ధృవీకరించారు. ఈ ఘటనలో సుమారు రూ.22 లక్షల విలువైన ఆలయ డాలర్లు గల్లంతైనట్టు తేలింది.
ఇటీవల నిర్వహించిన అంతర్గత ఆడిట్లో ఈ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ఆలయంలో పనిచేసే ఓ ఉద్యోగి చేతివాటమే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. డాలర్ల నిల్వలు, విక్రయ లెక్కల్లో తీవ్ర వ్యత్యాసాలు బయటపడటంతో విచారణకు ఆదేశించారు.
ఇది తొలిసారి కాదు. గతంలోనూ ప్రసాదాల తయారీ కేంద్రంలో చింతపండు ఎత్తుకెళ్లిన ఘటన, అలాగే ప్రసాదాల అమ్మకాలలో అవకతవకలకు పాల్పడిన సిబ్బంది వ్యవహారాలు ఆలయ ప్రతిష్ఠకు మచ్చతెచ్చాయి. అయినా సరే, ఇటువంటి ఘటనలు పునరావృతం కావడం భక్తుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.
నిత్యం చిన్నచిన్న చేతివాటాలతో ఆలయ ఆదాయానికి గండి కొడుతున్న ఇంటి దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. కోట్ల రూపాయల విరాళాలతో నడిచే ప్రముఖ ఆలయంలో భద్రత, పర్యవేక్షణ వ్యవస్థలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు చెబుతున్నారు. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే, ఈసారి అయినా చర్యలు కనిపిస్తాయా? అన్న ప్రశ్న భక్తుల్లో మిగిలిపోయింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి