వీఐపీఎస్ ముఠా గుట్టురట్టు..
వీఐపీఎస్ ముఠా గుట్టురట్టు..
NM Yadav
వేవ్' పేరుతో భారీ మాయాజాలం..
రెట్టింపు లాభాల పేరుతో వందల కోట్ల దగా మరో మోసానికి యత్నం..
నల్గొండలో పది మంది ఏజెంట్లు అరెస్ట్ కంపెనీ సీఈఓ సహా ఐదుగురి కోసం గాలింపు..
నల్గొండ : అధిక లాభాలు క్యాష్బ్యాక్ ఆఫర్లంటూ ఆశచూపి వందల కోట్ల రూపాయల మేర ప్రజలను ముంచిన ‘వీఐపీఎస్’ (VIPS) గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మోసాలను నల్గొండ పోలీసులు బట్టబయలు చేశారు. విలాసవంతమైన జీవితం తక్కువ కాలంలోనే కోట్లు సంపాదించవచ్చనే మాయమాటలతో అమాయక పెట్టుబడిదారులను బుట్టలో వేసుకున్న ఈ ముఠా తాజాగా ‘వేవ్’ అనే కొత్త పేరుతో మరో దగాకు తెరలేపింది. శనివారం నల్గొండ పట్టణ శివార్లలో బాధితులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు మెరుపు దాడి చేసి పది మంది నిందితులను కటకటాల్లోకి నెట్టారు. నిందితులపై చీట్ ఫండ్స్ నిరోధక చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కుంభకోణం మూలాలు మహారాష్ట్రలోని పుణెలో ఉన్నాయి. ప్రధాన నిందితుడు వినోద్ తుకారాం ఖుటే 2016లో తొలుత ఒక వాలెట్ యాప్ను ప్రారంభించి, 2018 నాటికి దాన్ని భారీ నెట్వర్క్ మార్కెటింగ్ సంస్థగా విస్తరించాడు. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే రోజువారీ రాబడి ఇస్తామని చైన్ సిస్టమ్ పద్ధతిలో సభ్యులను చేర్పిస్తే భారీ కమిషన్లు ఇస్తామని నమ్మబలికారు.
అంతేకాకుండా ట్రేడింగ్ పేరుతో నెలవారీ వడ్డీలు, స్థలాలు కొంటే వంద నెలల్లో వంద శాతం క్యాష్బ్యాక్ వంటి అసాధ్యమైన హామీలతో మధ్యతరగతి ప్రజల నుంచి వందల కోట్లు వసూలు చేశారు. తీరా గడువు ముగిశాక పెట్టుబడిదారులకు మొండిచేయి చూపడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. పాత బకాయిలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న ఈ ముఠా తాజాగా సరికొత్త ఎత్తుగడ వేసింది. పాత బాధితులే లక్ష్యంగా ‘వేవ్’ అనే కొత్త కంపెనీలో మరో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే గతంలో పోగొట్టుకున్న డబ్బుతో సహా అధిక లాభాలు ఇప్పిస్తామంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నల్గొండలోని లక్ష్మి గార్డెన్స్ వద్ద రహస్యంగా సమావేశం నిర్వహిస్తుండగా నల్గొండ రూరల్ పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్కు చెందిన కానాల లక్ష్మినారాయణ రావుతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన తొమ్మిది మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి పది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న కంపెనీ అధినేత వినోద్ తుకారాం ఖుటే, డైరెక్టర్లు సుమిత్ పురాంక్, కల్యాణ్ చక్రవర్తి తదితరుల కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశను మోసగాళ్లు పెట్టుబడిగా మార్చుకుంటున్నారని సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని అదనపు ఎస్పీ సూచించారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐ రాఘవరావు, ఎస్ఐ సైదా బాబు బృందాన్ని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి