తెలుగు భాషా వికాసంపై ఎన్జీ కళాశాలలో జాతీయ సదస్సు
తెలుగు భాషా వికాసంపై ఎన్జీ కళాశాలలో జాతీయ సదస్సు
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
నల్లగొండ:
తెలుగు భాషా వికాసంలో చోటుచేసుకుంటున్న మార్పులు, విభిన్న దృక్పథాలపై చర్చించేందుకు నాగార్జున ప్రభుత్వ కళాశాల వేదిక సిద్ధమైంది. కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో జనవరి 30న “తెలుగు భాషా వికాసం – వివిధ వైఖరులు” అనే అంశంపై ఒకరోజు జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, తెలుగు విభాగాధ్యక్షుడు డా. వెల్దోడి శ్రీధర్ తెలిపారు.ఈ సందర్భంగా సోమవారం సదస్సు బ్రోచర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డా. పరంగి రవికుమార్, డా. అంతటి శ్రీనివాస్, పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి, అకాడమిక్ కోఆర్డినేటర్ బత్తిని నాగరాజు, తెలుగు అధ్యాపకులు పాల్గొన్నారు.
తెలుగు భాష పరిణామ క్రమం, ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక డిజిటల్ యుగం వరకు భాషలో వచ్చిన మార్పులు, మారుతున్న సామాజిక పరిస్థితుల్లో తెలుగు ఎదుర్కొంటున్న సవాళ్లపై సదస్సులో లోతైన విశ్లేషణ జరగనుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల నుంచి ఆచార్యులు, భాషావేత్తలు, సాహితీవేత్తలు, కళాశాలల అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొని పరిశోధనా పత్రాలు సమర్పించనున్నారు.ప్రధానంగా కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, కృత్రిమ మేధ (AI) యుగంలో తెలుగు భాష వినియోగం, సాంకేతిక రంగంలో తెలుగు అవకాశాలపై చర్చ జరగనుంది. అలాగే తెలుగు నేలపై ఉన్న వివిధ మాండలికాల అస్తిత్వం, తెలంగాణ మాండలిక భాషా సౌరభం, సాహిత్య వికాసం, ఆధునిక సాహిత్యంలో కొత్త ధోరణులు, విమర్శనాత్మక దృక్పథాలపై పరిశోధనా పత్రాలు ఉండనున్నాయి. మారుతున్న విద్యా విధానంలో తెలుగు బోధనకుఅవలంబించాల్సిన నూతన పద్ధతులపై కూడా ప్రముఖ విద్యావేత్తలు ప్రసంగించనున్నారు.తెలుగు భాషాభిమానులు, అధ్యాపకులు, విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని కళాశాల తెలుగు విభాగం కోరింది. సదస్సులో పాల్గొనే ప్రతినిధులు ఈ నెల 29లోపు పూర్తి పరిశోధనా పత్రాన్ని telugungc2022@gmail.com కు పంపించాలని సూచించారు. నమోదు రుసుము ఆచార్యులకు రూ.1000, పరిశోధకులకు రూ.500గా నిర్ణయించారు. ఇతర వివరాలకు 9866977741 నంబరును సంప్రదించవచ్చని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి