తడిసిన ధాన్యాన్ని కటింగ్ లేకుండా తూకం వేయాలి కలెక్టరేట్ ముందు సీపీఎం ధర్నా.. రైతుల సమస్యలపై వీరారెడ్డి
తడిసిన ధాన్యాన్ని కటింగ్ లేకుండా తూకం వేయాలి కలెక్టరేట్ ముందు సీపీఎం ధర్నా.. రైతుల సమస్యలపై వీరారెడ్డి
Editor Desk
రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని కటింగ్ లేకుండా తూకం వేయాలని, రైతులకు వెంటనే చెల్లింపులు జరపాలని కోరారు.
సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు నిర్వహించిన ధర్నాలో పాల్గొని ఆయన మాట్లాడారు. రబీ సీజన్ ధాన్య సేకరణపై ఉమ్మడి జిల్లా మంత్రులు ఇప్పటివరకు సమీక్ష నిర్వహించకపోవడం దారుణమన్నారు. జిల్లా అధికారులతో సమీక్షించి 15 రోజుల్లో మొత్తం ధాన్యం కొనుగోలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతాంగాన్ని సమీకరించి ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
జిల్లాలోని 459 కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించినప్పటికీ ఇప్పటివరకు సగం కూడా కొనుగోలు చేయలేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు రోజుల తరబడి నిరీక్షిస్తున్నారని, వెంటనే కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడుస్తోందన్నారు.
కేంద్రాల్లో టార్పాలిన్లు, మంచినీటి వసతి వంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలు, తేమ పేరుతో బస్తాకు అదనంగా 2 నుంచి 10 కిలోల వరకు తరుగు వేస్తున్నారని ఆరోపించారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే లారీల ద్వారా తరలించకపోవడంతో కేంద్రాల వద్ద నిల్వలు పేరుకుపోతున్నాయన్నారు.
మిల్లుల వద్ద రోజుల తరబడి ధాన్యం దిగుమతి చేయకపోవడంతో లారీలు తిరిగి కేంద్రాలకు రావడం లేదని తెలిపారు. మిల్లుల వద్ద వెయిటింగ్ పేరుతో రైతుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరతతో పాటు ట్రక్ షీట్లు ఇచ్చే సమయంలో కూడా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.
తాలు, తరుగు పేరుతో అదనపు తూకం వేయరాదని, తూకం అనంతరం వెంటనే ట్రక్ షీట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ట్రక్ షీట్ ఇచ్చిన రెండు, మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. అదనపు లారీలను ఏర్పాటు చేసి వేగంగా కొనుగోలు చేపట్టాలని, మిల్లుల వద్ద వెంటనే దిగుమతులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే ప్రైవేట్ గోదాములను లీజుకు తీసుకుని నిల్వలు నిర్వహించాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని దిగుమతి చేయకుండా, మిల్లర్లు స్వయంగా కొనుగోలు చేసిన ధాన్యానికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని, జిల్లా అధికారులు రెగ్యులర్ పర్యవేక్షణ చేపట్టి యుద్ధప్రాతిపదికన ధాన్య సేకరణ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారీ ఐలయ్య, పాలడుగు నాగార్జున, డబ్బికార్ మల్లేష్, బండా శ్రీశైలం, కందాల ప్రమీల, సయ్యద్ హాషం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి