సూర్యాపేట పట్టణంలో ఉప్పల మన్సూర్ విగ్రహం ఏర్పాటు చేయాలి
సూర్యాపేట పట్టణంలో ఉప్పల మన్సూర్ విగ్రహం ఏర్పాటు చేయాలి
Biksham
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట పట్టణంలో కామ్రేడ్ ఉప్పల మన్సూర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మోతే మండలం సిరికొండ గ్రామంలో కామ్రేడ్ ఉప్పల మన్సూర్ గారి 27వ వర్ధంతి సందర్భంగా ఆయన నిలువెత్తు విగ్రహానికి మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్)సూర్యాపేట జిల్లా కార్యదర్శి షేక్ నజీర్, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు కంపాటి శ్రీను పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న మాట్లాడుతూ… సిరికొండ గ్రామంలో జన్మించిన కామ్రేడ్ ఉప్పల మన్సూర్ గారు సూర్యాపేట నియోజకవర్గానికి మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఎన్నికై, నాలుగు సార్లు మడమ తిప్పని ప్రజాప్రతినిధిగా సేవలందించారని తెలిపారు. నీతి, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన ఆయన పైసా కూడా పెట్టకుండా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని అన్నారు. చివరకు సిరికొండ సర్పంచిగా ఎన్నికై తన వృత్తిని కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించిన మహానాయకుడని కొనియాడారు. తాను నివసిస్తున్న ఇంటి స్థలాన్ని ప్రభుత్వ పాఠశాల కోసం ఇచ్చిన త్యాగదనుడని, కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి, మద్ది కాయల ఓంకార్ గారి ఆశయాలను తీసుకుని ప్రజల తరఫున నిరంతరం పోరాడిన నాయకుడని పేర్కొన్నారు. అంతటి నాయకుని కుటుంబానికి నేడు నిలువ నీడ లేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అనేక మంది నాయకులు పరామర్శించి వెళ్లినా తగిన న్యాయం జరగలేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే ఉప్పల మన్సూర్ కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి ఆదుకోవాలనిమార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగామార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) జిల్లా కార్యదర్శి షేక్ నజీర్ మాట్లాడుతూ… నేడు చిన్న అవకాశం వచ్చినా కోట్లకు పడిగెత్తే రాజకీయ పరిస్థితుల్లో, తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పోరాడుతూ ఆటో, బస్సుల్లో ప్రయాణిస్తూ ప్రజా కార్యక్రమాల్లో పాల్గొన్న మహా నాయకుడు కామ్రేడ్ ఉప్పల మన్సూర్ అని అన్నారు. శాసనసభకు కూడా ఆటోలోనే వెళ్లి ప్రజల వాణిని వినిపించిన వ్యక్తి అని, నేటి యువత ఆయన ఆశయాలను అనుసరించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు కాంపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ… మారుమూల గ్రామమైన సిరికొండలో పుట్టి, రాష్ట్రవ్యాప్తంగా అణగారిన వర్గాల ప్రతినిధిగా 30 సంవత్సరాలు ప్రజాసేవ చేసిన నిస్వార్థ నాయకుడు ఉప్పల మన్సూర్ అని అన్నారు. ఆయన విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డులో ప్రతిష్టించి, వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు, ఆయన కుమార్తె సంపంగి కొమరక్క, పార్టీ నాయకులు కాంపాటి జానయ్య, కాంపాటి వెంకన్న, బుర్ర వెంకన్న, నరేందర్, ఉప్పల నరేందర్, మాజీ సర్పంచ్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి