స్వేచ్ఛాయుత, శాంతియుత మున్సిపల్ ఎన్నికలే లక్ష్యం.రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని
స్వేచ్ఛాయుత, శాంతియుత మున్సిపల్ ఎన్నికలే లక్ష్యం.రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని
స్థానికం బృందం
అధికార యంత్రాంగం పూర్తిస్థాయి సిద్ధతలో ఉండాలి:
హైదరాబాద్:స్థానికం ప్రధాన ప్రతినిధి
రాష్ట్రంలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, శాంతియుత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా అన్ని జిల్లాల అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని స్పష్టం చేశారు.మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని గుర్తు చేశారు. ఎన్నికల నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో వెబ్కాస్టింగ్కు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ పంచాయితీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో మున్సిపల్ ఎన్నికలను కూడా నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని సమర్థవంతంగా అమలు చేయాలని, విధుల్లో ఎలాంటి అలసత్వానికి తావు లేకుండా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బాధ్యతగా పని చేయాలని స్పష్టం చేశారు.రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా పోలీస్ శాఖ పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఎన్నికల విధులకు తగినంత సిబ్బందిని నియమిస్తామని వెల్లడించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ అక్షాంశు యాదవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఆర్టీవోలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి