బెయిల్ కోసం రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు.
కీసర: రేషన్ బియ్యం కేసులో నిందితులకు బెయిల్ ఇప్పించేందుకు రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కీసర సీఐ అంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. కీసర చెరువు వద్ద రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఎస్ఐ జ్ఞానేందర్రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కినట్లు తెలిసింది.
రేషన్ బియ్యం కేసులో నిందితులను బెయిల్ కోసం సీఐ, ఎస్ఐలు లంచం డిమాండ్ చేసినట్లు బాధితులు ఆరోపించారు. కొంతకాలంగా నిందితులతో వివిధ పనులు చేయించుకోవడంతో పాటు బిర్యానీలు, కూల్డ్రింక్స్ తీసుకురావాలని సీఐ వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. కెమికల్ టెస్టులు చేయించకుండా కేసు విషయంలో ముప్పుతిప్పలు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి.ఈ వేధింపులతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు తెలిసింది. పక్కా ప్రణాళికతో కీసర చెరువు వద్ద లంచం అందజేస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసినట్లు సమాచారం. అధికారులు వస్తున్న విషయాన్ని గమనించిన ఎస్ఐ జ్ఞానేందర్రెడ్డి అక్కడి నుంచి పరుగులు తీసినప్పటికీ ఏసీబీ బృందం పట్టుకున్నట్లు తెలిసింది.
గణేష్ నిమజ్జనం బందోబస్తు విధుల్లో ఉన్న సమయంలోనే లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఘటనపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టి పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి