రాష్ట్రస్థాయిలో యాదాద్రి భువనగిరికి అరుదైన గౌరవం కలెక్టర్ హనుమంత రావుకు ఉత్తమ ఎన్నికల పురస్కారం
రాష్ట్రస్థాయిలో యాదాద్రి భువనగిరికి అరుదైన గౌరవం కలెక్టర్ హనుమంత రావుకు ఉత్తమ ఎన్నికల పురస్కారం
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా మరోసారి రాష్ట్రస్థాయిలో తన సత్తా చాటింది. ఎన్నికల నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచినందుకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంత రావు రాష్ట్రస్థాయి ఉత్తమ ఎన్నికల పురస్కారానికి ఎంపికయ్యారు. ఉత్తమ ఎన్నికల విధానాల విభాగంలో యాదాద్రి భువనగిరి జిల్లాను రాష్ట్రంలోనే ఉత్తమ జిల్లాగా ప్రకటించారు.పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని 2025 సంవత్సరానికి గాను ఎన్నికల నిర్వహణలో ప్రతిభ చూపిన అధికారుల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి. సుదర్శన్ రెడ్డి శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర గౌరవ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా కలెక్టర్ హనుమంత రావు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు.ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా నిర్వహించినందుకు జిల్లాకు ఈ గుర్తింపు లభించింది. ఓటర్ల అవగాహన, పోలింగ్ శాతం పెంపు, ఎన్నికల నిర్వహణలో క్రమశిక్షణ వంటి అంశాల్లో జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని ఎన్నికల అధికారులు ప్రశంసించారు.ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంత రావు మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఎన్నికల అధికారులు, సిబ్బంది, క్షేత్రస్థాయిలో పనిచేసిన ప్రతీ ఉద్యోగికి అభినందనలు తెలిపారు. అందరి సమిష్టి కృషి ఫలితంగానే జిల్లాకు ఈ గౌరవం దక్కిందని పేర్కొన్నారు.రాష్ట్రస్థాయిలో యాదాద్రి భువనగిరి జిల్లాకు గుర్తింపు రావడం పట్ల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి