రామన్నపేటకు ప్రత్యేక నియోజకవర్గం సాధనపై ఉద్యమం ఉధృతం. నకరికంటి నరేష్
రామన్నపేటకు ప్రత్యేక నియోజకవర్గం సాధనపై ఉద్యమం ఉధృతం. నకరికంటి నరేష్
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటను మళ్లీ ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ సాధన సమితి పోరాటాన్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో బహుజన సమాజ్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించగా, అవసరమైతే ఏ పోరాటానికైనా సిద్ధమని మండల అధ్యక్షుడు నకిరేకంటి నరేష్ తెలిపారు.
రామన్నపేటకు ప్రత్యేక రాజకీయ చరిత్ర ఉన్నదని, గతంలో పలు ప్రముఖులు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికై మంత్రివర్గాల్లో పనిచేశారని గుర్తు చేశారు. ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, కొమ్ము పాపయ్య వంటి నేతలు రాష్ట్ర మంత్రివర్గాల్లో సేవలందించిన విషయాన్ని ప్రస్తావించారు. వివిధ దశల్లో రెడ్డి, బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన నాయకులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవడం రామన్నపేట ప్రత్యేకతగా పేర్కొన్నారు.
1952లో హైదరాబాద్ రాష్ట్ర కాలంలోనే రామన్నపేట నియోజకవర్గంగా ఏర్పడి, తరువాత ఆంధ్రప్రదేశ్లో కొనసాగిందని వివరించారు. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రామన్నపేటను నకిరేకల్ నియోజకవర్గంలో విలీనం చేయడం అన్యాయమని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర స్థాయిలో పునర్విభజన అంశం చర్చలో ఉండటం రామన్నపేట ప్రజలకు ఆశ కలిగిస్తోందన్నారు. 2025 జూన్ 25 నుంచి అఖిలపక్షాల ఆధ్వర్యంలో సాధన సమితి వందకు పైగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తోందని తెలిపారు.
రామన్నపేటను మళ్లీ నియోజకవర్గంగా సాధించే వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం కొనసాగిస్తామని, అన్ని వర్గాల మద్దతుతో లక్ష్యాన్ని సాధిస్తామని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి