రామన్నపేట నియోజకవర్గం పునరుద్ధరణకు ఏకగ్రీవ తీర్మానం
రామన్నపేట నియోజకవర్గం పునరుద్ధరణకు ఏకగ్రీవ తీర్మానం
Editor Desk
రామన్నపేటను తిరిగి నియోజకవర్గంగా పునరుద్ధరించాలని మునిపంపుల గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, రామన్నపేట ఒకప్పుడు తాలూకా కేంద్రంగా, మునిసిపాలిటీగా ఉండి 1952 నుంచి 2009 వరకు నియోజకవర్గంగా ప్రాధాన్యం సంతరించుకుందని తెలిపారు. అనంతరం రద్దు చేసి నకిరేకల్ నియోజకవర్గంలో కలపడంతో అభివృద్ధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ ప్రాంతం తన స్వరూపాన్ని కోల్పోయిందని అన్నారు.
ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రామన్నపేటను మళ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు అవసరమైన కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు ఇప్పటికే రామన్నపేటలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
నియోజకవర్గ పునరుద్ధరణ కోసం చేపట్టే పోరాటంలో గ్రామ ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఉపసర్పంచ్ తాళ్ల క్రాంతి కుమార్, వార్డు సభ్యులు యాదాసు మంగమ్మ, యాదాసు లక్ష్మణ్ కుమార్, మేకల రాములు, కూనూరు లక్ష్మమ్మ, గంటపాక శ్రీను, బూడిద నర్మద, నీల రజిత, మేకల జలంధర్, కట్ట అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి