రాజేశ్ హత్యపై న్యాయం ఎందుకు దూరం?.మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
రాజేశ్ హత్యపై న్యాయం ఎందుకు దూరం?.మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
స్థానికం బృందం
బాధ్యులను శిక్షించకపోతే పోరాటం తప్పదు
ఇకపై దాడులకు ప్రతిదాడులు
మూడేండ్లలో మళ్లీ అధికారంలోకి బీఆర్ఎస్
కోదాడ, స్థానికం ప్రధాన ప్రతినిధి
మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి దంపతుల కనుసన్నల్లోనే కోదాడ నియోజకవర్గంలో పోలీసుల గుండారాజ్యం కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. లాకప్లో దళిత యువకుడు రాజేశ్ మృతికి నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో కోదాడ’ కార్యక్రమం రాజకీయ వేడిని పెంచింది.
పట్టణంలో జరిగిన భారీ ర్యాలీ అనంతరం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. రాజేశ్ మృతి ముమ్మాటికీ హత్యేనని స్పష్టం చేశారు. 68 రోజులు గడిచినా బాధ్యులైన పోలీసులపై చర్యలు లేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పోలీసుల చిత్రహింసల వల్లే రాజేశ్ మరణించాడని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఆధారాలతో వెల్లడించినా, చిలుకూరు ఎస్సైను కాపాడటమే ప్రభుత్వ ధ్యేయంగా మారిందని ఆరోపించారు.దళితుల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని మండిపడ్డారు. విచారణ, పోస్టుమార్టం అన్నీ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని విమర్శించారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కోదాడ సీఐ ఇసుక, మద్యం, మట్టి మాఫియాలతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు.
ఇకపై ఇలాంటి దాడులు కొనసాగితే ప్రతిఘటన తప్పదని స్పష్టం చేశారు. బాధ్యులను శిక్షించకపోతే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక పాలనకు ఇది ఆరంభమేనని, మరో మూడేళ్లలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
జోష్ నింపిన ‘చలో కోదాడ’
ఆరు మండలాలు, కోదాడ పట్టణం నుంచి వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలిరావడంతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ‘జై కేసీఆర్’, ‘జై కేటీఆర్’ నినాదాలతో పట్టణం మార్మోగింది. రాజేశ్ తల్లి అలితమ్మ కన్నీటి వేదన అందరినీ కదిలించింది. తన బిడ్డకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించాలని ఆమె చేసిన విజ్ఞప్తి సభను భావోద్వేగానికి గురిచేసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి