రైతుల అభివృద్ధికి ఆధునిక వ్యవసాయం అవసరం – మంత్రి తుమ్మల
రైతుల అభివృద్ధికి ఆధునిక వ్యవసాయం అవసరం – మంత్రి తుమ్మల
Krishna
రాష్ట్ర అభివృద్ధిలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందని, “తెలంగాణ రైజింగ్ 2045” లక్ష్యాలను సాధించాలంటే వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడం అత్యవసరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ మరియు ఇక్రిశాట్ సంయుక్త ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గానికి చెందిన యువ రైతులకు “సాయిల్ హెల్త్ వాలంటీర్లు”గా రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని పటాన్చెరు ఇక్రిశాట్ వ్యవసాయ క్షేత్రంలో ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎనిమిది మండలాలకు చెందిన ప్రతి గ్రామం నుంచి ఒక్కో రైతును ఎంపిక చేసి శిక్షణ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భూసార పరీక్షలు, పంటల ఎంపిక, పంటల మార్పిడి, వాతావరణ ప్రభావం, అంతర్ పంటల సాగు, సేంద్రీయ వ్యవసాయం వంటి అంశాలపై నిపుణులు సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల ప్రధాన ఆస్తి భూమి అని, భూమి ఆరోగ్యంగా ఉంటేనే దిగుబడులు పెరిగి ఆదాయం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. భూమి ఆరోగ్య పరిరక్షణలో సాయిల్ హెల్త్ వాలంటీర్లు కీలక పాత్ర పోషించాలని, శాస్త్రీయ పద్ధతులు గ్రామీణ స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల భూమి సారవంతత తగ్గిపోతుందని, పంటల మార్పిడి, బయో ఫెర్టిలైజర్లు, సేంద్రీయ ఎరువుల వినియోగం ద్వారా నేల నాణ్యతను కాపాడుకోవచ్చని తెలిపారు. అంతర్ పంటల సాగు ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని, యాంత్రీకరణ మరియు అగ్రిటెక్ వినియోగంతో లాభదాయక వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ ముఖ్య శాఖ కార్యదర్శి సురేంద్ర మెహన్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ జానయ్య, కొండా లక్ష్మణ్ హార్టీకల్చరల్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజిరెడ్డి, హార్టికల్చర్ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ స్టాన్ఫోర్డ్ బ్లాడే, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి