పిల్లలమర్రి ఆలయాల పరిరక్షణకు కృషి చేస్తాం
పిల్లలమర్రి ఆలయాల పరిరక్షణకు కృషి చేస్తాం
Biksham
ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ కేంద్ర కమిటీ సభ్యులు మణికొండ వేదకుమార్
పురాతన దేవాలయాలను సందర్శించి శాసనాలు, శిల్ప సంపద పరిశీలన
జిల్లా కేంద్రానికి సమీపంలోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన పిల్లలమర్రి దేవాలయాలను ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ కేంద్ర కమిటీ సభ్యులు మణికొండ వేదకుమార్ ఆదివారం సందర్శించారు. నల్లగొండ జిల్లా ఇంటాక్ సభ్యులు పెద్దిరెడ్డి గణేష్తో కలిసి ఆలయాలను పరిశీలించి అక్కడి చారిత్రక విశిష్టతను తెలుసుకున్నారు.
పిల్లలమర్రి గ్రామంలోని దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన, శ్రీ పార్వతీనామేశ్వరాలయం, ఎరుకేశ్వర ఆలయం, త్రికూటేశ్వర ఆలయాలను సందర్శించిన ఆయన, అక్కడ ఉన్న శాసనాలు, శిల్ప సంపద, పురాతన నిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లా సభ్యులు పెద్దిరెడ్డి గణేష్ వివరించిన చారిత్రక అంశాలను అక్కడి శిల్పకళా వైభవంతో సరిపోల్చి పరిశీలించిన వేదకుమార్, ఆలయాల నిర్మాణ శైలి, కళా వైభవంపై ప్రశంసలు వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, పిల్లలమర్రి దేవాలయాల చారిత్రక విశిష్టతను దేశవ్యాప్తంగా చాటిచెప్పేలా త్వరలో ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించి ఢిల్లీలోని ఇంటాక్ కేంద్ర కార్యాలయానికి అందజేస్తానని తెలిపారు. ఈ డాక్యుమెంటరీ ద్వారా కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల దృష్టిని ఆకర్షించి, ఆలయాల సంరక్షణకు అవసరమైన నిధులు సాధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఇలాంటి అపురూపమైన జాతీయ వారసత్వ సంపదను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, తగిన సంరక్షణ చర్యలు చేపడితే భావితరాలకు ఈ చారిత్రక కట్టడాలను అందించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతకుముందు జిల్లా కేంద్రంలోని సుధా బ్యాంక్ సమీపంలో మణికొండ వేదకుమార్కు ఇంటాక్ సభ్యులు భోనగిరి భాస్కర్, ధనంజయతో పాటు ఇతర సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక చరిత్రాభిమానులు, ఇంటాక్ సభ్యులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి