పాముకు కోరల్లో విషం… విపక్షానికి ఒంటి నిండా విషమే. పొంగులేటి శ్రీనివాస్
పాముకు కోరల్లో విషం… విపక్షానికి ఒంటి నిండా విషమే. పొంగులేటి శ్రీనివాస్
Editor Desk
మున్సిపల్ ఎన్నికల్లోనూ డిపాజిట్లు గల్లంతు కావాలి: మంత్రి పొంగులేటి
69 శాతం పంచాయతీల స్ఫూర్తితో పట్టణాల్లోనూ కాంగ్రెస్ పాగా
రూ. 361.55 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శ్రీకారం
మద్దులపల్లి స్థానికం ప్రధాన ప్రతినిధి
“పాముకు కోరల్లో మాత్రమే విషం ఉంటుంది… కానీ పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకుని అప్పుల పాలు చేసిన ఆ నాయకులకు ఒంటి నిండా విషమే ఉంది. తమ పాపాలు బయటపడతాయనే భయంతోనే ప్రజా ప్రభుత్వంపై నిత్యం విషం కక్కుతున్నారు” అంటూ తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా మద్దులపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ విపక్షాల రాజకీయాన్ని ఎండగట్టారు.అసెంబ్లీ, పార్లమెంటు, కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్కు స్పష్టమైన తీర్పు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. “సెమీఫైనల్స్ అంటూ కారుకూతలు కూస్తున్న చిచ్చర పిడుగులకు, టిల్లూలకు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 69 శాతం గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ప్రజా ప్రభుత్వానికి ఇచ్చిన రెఫరెండం” అని పేర్కొన్నారు.
ఈ స్ఫూర్తితో పట్టణాల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చిన మంత్రి, ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యేలా శ్రేణులు పని చేయాలని సూచించారు.జిల్లా అభివృద్ధిలో సాగునీటి ప్రాజెక్టులు చారిత్రక మైలురాయిగా నిలవనున్నాయని పొంగులేటి తెలిపారు. రూ. 162.54 కోట్లతో చేపట్టిన మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ ద్వారా 1.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందన్నారు. అలాగే రూ. 108.60 కోట్లతో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల, రూ. 45.50 కోట్లతో కూసుమంచిలో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం జిల్లా యువతకు, పేదలకు పెద్ద వరమని చెప్పారు.తమను గెలిపించేందుకు అహోరాత్రులు శ్రమించిన కార్యకర్తలను ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దే బాధ్యత తమదేనని మంత్రి భరోసా ఇచ్చారు. “పేదవాడి పక్షాన నిలబడే ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతోంది. విపక్షాల కారుకూతలను ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా అభివృద్ధి ఆగదు” అని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి