పగిడిమర్రిలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం
పగిడిమర్రిలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం
స్థానికం బృందం
ఓటు చైతన్య ర్యాలీ, శ్రమదానంతో అర్థవంతమైన కార్యక్రమం
స్థానికం ప్రధాన ప్రతినిధి
జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని పగిడిమర్రి గ్రామంలో ఓటు హక్కుపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి) ఎన్.ఎస్.ఎస్ యూనిట్–సిక్స్ ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ నాగవల్లి నాగమణి సైదులు అధ్యక్షతన జాతీయ ఓటర్ల దినోత్సవ అవగాహన ర్యాలీ ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులు గ్రామ వీధుల గుండా ర్యాలీగా సాగుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాముఖ్యత, ఎన్నికల విలువ, ప్రతి ఓటరు తన ఓటు హక్కును బాధ్యతతో వినియోగించుకోవాల్సిన అవసరంపై నినాదాలు చేశారు.
“ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు”,
“మై ఇండియా మై ఓటు”,
“నోటు వద్దు ఓటు ముద్దు”,
“బుల్లెట్ కంటే బ్యాలెట్ బలమైనది”
అనే నినాదాలతో గ్రామ ప్రజల్లో చైతన్యం కల్పించారు.
ర్యాలీలో ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు చురుకుగా పాల్గొని, ముఖ్యంగా యువత తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని, ఎన్నికల సమయంలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి పౌరుడి పాత్ర కీలకమని వివరించారు.
ఈ కార్యక్రమానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై ర్యాలీకి మద్దతు తెలిపారు. గ్రామాల్లో ఓటు హక్కుపై అవగాహన పెంపొందించడంలో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని అర్థవంతంగా జరుపుకుంటూ, ప్రజల్లో ఎన్నికలపై చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ర్యాలీ అనంతరం ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్ల ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించారు. గ్రామంలోని దేవాలయానికి పెయింటింగ్ కార్యక్రమాన్ని చేపట్టగా, గ్రామ ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొని సహకరించారు.ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ యూనిట్–సిక్స్ ప్రోగ్రాం అధికారి కంబాలపల్లి శివరాణి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గోలి జగాల్ రెడ్డి, గోలి నర్సిరెడ్డి, ఇటుకల లవేందర్, ఈగల వెంకటరెడ్డి, సింగం సత్తయ్యతో పాటు గ్రామ ప్రజలు, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి